Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మహిళల నిర్బంధం
- పోలీస్స్టేషన్లో తమను హింసించారన్న బాధితులు
- శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలో ఉద్రిక్తత
శ్రీనగర్: 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నదంటూ కాశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నేతల నుంచి సామాన్య ప్రజల వరకూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్లో సైన్యం మోహరింపు పట్ల స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమ కనీస అవసరాల కోసం వీధుల్లోకి వచ్చినా అనుమానిస్తూ హింసిస్తున్నారని శ్రీనగర్వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం ముగ్గురు మహిళలను 12 గంటలపాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి తీవ్రంగా హింసించడం పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అర్ధరాత్రి వేళల్లో ఇండ్లల్లోంచి పురుషుల్ని తీసుకెళ్తున్నారని, మహిళలను వేధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
'మా తండ్రులు తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియడంలేదు, తమనూ వేధిస్తారేమోనన్న ఆందోళన కలుగుతోంది' అంటూ యుస్రా అనే టీనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్లోని సౌరా ప్రాంతం నుంచి ఈ నెల 15న ముగ్గురు మహిళల్ని స్థానిక పోలీస్ స్టేషన్లో 12 గంటలపాటు నిర్బంధించిన తీరు అక్కడి వారిని ఆందోళనకు గురి చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కూతురికి మందులు తేవడానికి వీధిలోకి రాగా, స్టేషన్ హౌజ్ అధికారి(ఎస్హెచ్వో) తనను ఈడ్చుకెళ్తూ లాఠీతో కొట్టారని 20 ఏండ్ల శబ్నం అనే మహిళ తెలిపారు. తన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని మీడియాకు చూపారు. తనతోపాటు
మా కుటుంబంలోని మరో మహిళ, టీనేజ్ బాలికను కూడా పోలీస్స్టేషన్లో నిర్బంధించి హింసించారని బాధితురాలు తెలిపారు. తన తప్పేమిటని పోలీసుల్ని ప్రశ్నించానని ఆమె తెలిపారు. అదేరోజు అర్ధరాత్రి వేళ తమను విడుదల చేశారని ఆ మహిళ తెలిపారు.
ఏ కారణాలు లేకుండానే ముగ్గురు మహిళల్ని స్టేషన్కు తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎస్పీపై కేసు పెడ్తామని వారు తెలిపారు. మహిళా అధికారులు లేకుండా మహిళల్ని ఎలా కొడ్తారని వారు ప్రశ్నించారు. పురుషులతోపాటు జనరల్ సెల్లో ఎలా నిర్బంధించారని వారు నిలదీస్తున్నారు. సౌరాతో మిగతా నగరానికి సంబంధాలు లేకుండా చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయామని వారు తెలిపారు. మందుల దుకాణాలు మూతపడటంతో పసి పిల్లల శుభ్రత కోసం వినియోగించే నాప్కిన్స్ కూడా అందుబాటులో లేవని వారు తెలిపారు. వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని సౌరా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రతా దళాల చర్యలకు నిరసనగా యువతుల్ని సమీకరిస్తున్నానన్న కారణంతో పాఠశాల యాజమాన్యం తనను బహిష్కరించిందని వనీ అనే టీనేజ్ బాలిక తెలిపారు. తానిపుడు వేరే పాఠశాలలో చేరి చదువు కొనసాగిస్తున్నానని వనీ తెలిపారు. తాము నిత్యావసరాల కొనుగోలు కోసం వీధుల్లోకి వస్తే సీఆర్పీఎఫ్ జవాన్లు దుర్భాషలాడుతున్నారని బీబా ఖాటూన్ అనే మహిళ వాపోయారు. భద్రతా దళాల చర్యలను నిరసిస్తూ సౌరాలోని మసీదు ఎదుట ఈ నెల 20న జరిగిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. కాశ్మీరీల పట్ల ప్రేమగా మెలగాలన్న మోడీ మాటల్లో నిజం లేదని ఆమె విమర్శించారు. మా కూతుళ్లనూ, పురుషులనూ ఆయన చంపాలనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. కొన్ని వారాలుగా సౌరా ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నెల మొదటి వారంలో ఆందోళనకారులపై భద్రతా దళాలు పెల్లెట్ గన్స్తో విరుచుకుపడగా 40మందికిపైగా గాయపడ్డారు.