Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక హోదా రద్దుతో ఇండియన్ యూనియన్, జమ్మూకాశ్మీర్ మధ్య సంబంధాలకు విఘాతం : సీపీఐ(ఎం) కాశ్మీర్ నేత తరిగామి
సమాఖ్య సూత్రాలను తుంగలో తొక్కి మోడీ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతోపాటు రాజకీయ నేతల గృహ నిర్బంధం, అరెస్టులకు పాల్పడింది. అందులో భాగంగా సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ యూసఫ్ తరిగామిని కూడా గృహ నిర్బంధంలో వుంచింది. సుప్రీం కోర్టు అనుమతితో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన తరిగామి, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వచ్చిన తొలి రాజకీయ నేత. కాశ్మీర్కు తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో మహ్మద్ యూసఫ్ తరిగామి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు...
కాశ్మీర్పై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కాశ్మీర్ చారిత్రిక నేపథ్యమేంటీ?
ప్రస్తుతం బీజేపీ నేతలు వాస్తవాలు చెప్పటం లేదు. 1947 నాటి ప్రత్యేక పరిస్థితిని ప్రజలు తప్పనిసరిగా తెలుసుకుంటారని భావిస్తున్నా. దేశం స్వాతంత్య్రం సాధించింది. అలాగే దేశ విభజన కూడా జరిగింది. ఈ అత్యంత దురదృష్టకర పరిస్థితి చాలా సమస్యలను సృష్టించింది. దేశ విభజనకు జమ్మూ కాశ్మీర్ బాధితురాలు. అది కాశ్మీర్పై తీవ్ర ప్రభావం చూపింది. జమ్మూ కాశ్మీర్కు రెండు దేశాల్లో ఏ దేశంలోనైనా కలిసేందుకు అవకాశం వచ్చింది. అయితే కాశ్మీర్ ప్రజలు మాత్రం లౌకిక భారతదేశంవైపే మొగ్గు చూపారు. పాకిస్తాన్లో కలవాలన్న మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను కాశ్మీర్ ప్రజలు తిరస్కరించారు. ప్రధాని నెహ్రూ డిమాండ్పై 'ఇన్సుట్రూమెంట్ ఆఫ్ ఎక్స్సెషన్' పత్రం మీద రాజా హరిసింగ్ సంతకం చేశారు. కాశ్మీర్ ప్రజలు మతం ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకోలేదు. క్విట్ ఇండియా, క్విట్ జమ్మూకాశ్మీర్ వంటి రెండు ఒకే సారుప్యత గల ఉద్యమాల వల్ల నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ యూనియన్లో జమ్మూకాశ్మీర్ని భాగస్వామ్యం చేసేందుకు స్వాతంత్రోద్యమ నేతలు, భారత రాజ్యాంగ నిర్మాతలు, కాశ్మీర్లోని స్వాతంత్రోద్యమకారులతో చర్చలు జరిపారు. దీంతో రాజ్యాంగ అసెంబ్లీ, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగ హక్కులు కల్పించింది. ఆర్టికల్ 370 అనేది ఇండియన్ యూనియన్కు జమ్మూకాశ్మీర్కు మధ్య సంబంధాలను తెలుపుతుంది. దీనికి సంబంధించి జరిగిన సమావేశంలో నెహ్రూ, పటేల్, అంబేద్కర్ వంటి ముఖ్య నేతలంతా ఉన్నారు. వాస్తవంగా జరిగింది ఇదే. కానీ బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. దేశ ప్రజలు బీజేపీ మోసపూరిత ప్రచార వలలో పడొద్దని చెప్పదలిచాను.
ఆర్టికల్ 370తో కాశ్మీర్లో అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. అది ఎంత వరకు వాస్తవం?
ప్రస్తుతం తమ హక్కులపై దాడి జరుగుతున్నదని జమ్మూకాశ్మీర్ ప్రజలు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని సీపీఐ(ఎం) అభిప్రాయం పడుతున్నది. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగ సభకు అర్థం లేకుండా పోయింది. ఆర్టికల్ 370 ఉండటంతో కాశ్మీర్ అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్నారు. అయితే అది ఏరకమైన అభివృద్ధి అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రధాన మంత్రి ఎన్నికల్లో ''సబ్ కా సాత్...సబ్ కా వికాస్'' హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది. 2014 ఎన్నికల ప్రచారంలో యువతకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? మద్దతు ధర ఇస్తామని రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? దేశంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వ రెండో విడత 100 రోజుల పాలనలో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. జిడిపి 5 శాతానికి పడిపోయింది. ఇదేనా మోడీ సర్కార్ ఘనకార్యం. ఆటో మొబైల్ రంగం పూర్తిగా సంక్షోభం బారిన పడింది. ఆయా కంపెనీల్లో పని చేసే లక్షలాది మంది యువకులు ఉపాధిని కోల్పోయారు.
ప్రస్తుత నిర్బంధానికి ముందు ఏం జరిగింది?
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు. పార్లమెంట్ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కోరాం కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్లో పర్యటించింది. అన్ని పార్టీల నేతలను కలిసింది.కానీ భద్రతా కారణాలు చెప్పి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. కానీ పార్లమెంట్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. కేవలం అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికే భద్రతా కారణాలు చెప్పడం ఉద్దేశ్యపూర్వకంగా దాట చేయడమే. వివిధ రాష్ట్రాల నుంచి కాశ్మీర్కు జీవనోపాధి కోసం వచ్చిన వలస కార్మికులను బలవంతంగా వెల్లగొట్టారు. రాష్ట్రంలో భీభత్సాన్ని సృష్టించారు.
రాష్ట్ర విభజన, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుపై మీ అభిప్రాయమేంటీ?
రాష్ట్ర విభజన బిల్లు కాపీలు ఎవ్వరికీ అందలేదు. పార్లమెంట్లో ముఖ్యమైన ఈ బిల్లును పరిశీలనకు ఏ కమిటీకి పంపకుండా, విస్తృత చర్చ జరిగిందంటే ఎలా? ప్రజల మధ్య ఉంచారా? ఇది ఏదో సాధారణమైన బిల్లుకాదు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ముఖ్యమైన బిల్లు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తీసుకుని పార్లమెంట్లో ఆమోదించారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ చూద్దాం. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. చాలా ఏండ్ల పాటు చర్చ జరిగింది. చాలాసార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది. దాదాపు మూడేండ్లు ప్రజల మధ్య చర్చ సాగింది. అంతేకాదు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి రాష్ట్రాలను విభజించినప్పుడు కూడా చాలా చర్చలు జరిగాయి. కానీ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) రద్దు, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విభజన కేవలం మూడు గంటల్లోనే జరిగిపోయాయి. కనీసం రాష్ట్రానికి ఉండే హక్కులు కూడా లేకుండా చేసేందుకు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్ను విభజించారు.
ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు ప్రజలు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై మీరేమంటారు?
దేశ ప్రజల్ని బీజేపీ తప్పుదోవ పట్టేంచే విధంగా అసత్య ప్రచారానికి పూనుకుంది. నేను భారతీయుడిని. కాశ్మీరీలంతా అలానే ఫీలవుతున్నారు. నా కుటుంబం మొత్తం ఉగ్రవాదుల దాడుల్లో హతమైంది. మేము ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఉగ్రదాడులకు జమ్మూకాశ్మీరీలే ఎక్కువ బాధితులు. కాశ్మీర్పై భారత్కు హక్కు లేదని పాకిస్తాన్ అన్నప్పుడల్లా.. తామంతా ముక్తకంఠంతో పాకిస్తాన్ వాదనను వ్యతిరేకించాం. తత్ఫలితంగా నేషనల్ కాన్ఫెరెన్స్, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదుల దాడుల్లో హతమయ్యారు. తాము దేశం పక్షాన నిలబడినందుకే ఉగ్రవాదులు మా కార్యకర్తలను, నేతలను పొట్టన పెట్టుకున్నారు. అటువంటి మాకు ప్రస్తుత పరిణామాలు చెంపపెట్టు అయ్యాయి.
దేశ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు?
మొత్తం భారతదేశం మనదే అని నేను అంటున్నా. భారతదేశం ఏదో ఒక వర్గానికి చెందినది కాదు. ఒకే భావజాలం ఆధిపత్యం సాధ్యంకాదు. మనమంతా భారతీయులమని గర్వపడతాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనదేనని నేను అంటున్నా. కాశ్మీరీలను మనుషులుగా గుర్తించండి. కాశ్మీరీ ప్రజలను దేశ శత్రువులుగా, ఉగ్రవాదులుగా చిత్రించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఉగ్రవాదులకు టార్గెట్ మేమే. నిరంతరం ఉగ్రవాదులతో పోరాడుతున్న మమ్మల్ని ప్రభుత్వం విశ్వసించదా , ఇది ఎంత దురదృష్టకరం. తెలుగు ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే. 'గొప్ప పోరాట చరిత్ర కలిగిన తెలుగు ప్రజలారా.. కాశ్మీర్ ప్రజల బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని అక్కున చేర్చుకోండి. మా పోరాటంలో మీరు కూడా గళం కలపండి.