Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్ : దాదాపు 20 ఏండ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారుల సజీవదహనం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో నిందితుడిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు ధారాసింగ్కు కీలక సహచరుడుగా వున్న బుద్ధదేవ్ నాయక్ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురి హత్యలో అతని ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మయూర్బన్జ్ జిల్లా నిశ్చితాపూర్ గ్రామంలోని అతని నివాసంలో నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం గురించి తెలుసుకున్న సీబీఐ బృందం ఆయన నివాసంలో సోదాలు జరిపింది. గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారులు ఫిలిప్ (10), తిమోతీ(8)లను 1999 జనవరి 22న దుండుగలు సజీవదహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందతుడు ధారా సింగ్కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మరో 11 మందిని నిర్దోషులుగా విడుదలచేసింది. ఆస్ట్రేలియా మిషనరీ అయిన గ్రాహం స్టెయిన్స్ భువనేశ్వర్లోని కుష్టురోగుల షెల్టర్ హౌమ్లో సేవలందించేవారు. కాగా, సేవా ముసుగులో స్టెయిన్స్ పేద గిరిజనులను మతం మారుస్తున్నారంటూ ఆయనను దారుణంగా హత్యచేశారు.