Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా సంస్థలకు మద్రాస్ హైకోర్టు హెచ్చరిక
చెన్నై: నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ద్వారా సమాజానికి జరిగే నష్టానికి మూల్యం చెల్లించకుండా సోషల్మీడియా సంస్థలు తప్పించుకోజాలవని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లేదా మరేదైనా ప్రభుత్వ గుర్తింపును లింక్ చేయడాన్ని షరతుగా విధించాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.సత్యనారాయణన్, జస్టిస్ ఎన్.శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
వాట్సాప్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది ఎన్ఎల్ రాజా తన వాదన వినిపిస్తూ గుర్తింపు కార్డులు లింక్ చేయడమంటే వ్యక్తుల ప్రయివసీ హక్కుకు భంగం కలిగించడమేనని అన్నారు. సోషల్ మీడియాపై నియంత్రణ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే తమ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నదని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రయివసీ హక్కు నిరపేక్షమైంది కాదని, భావ ప్రకటనా స్వేచ్ఛ బాధ్యతతో కూడినదని హితవు పలికింది. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు ప్రచారానికి అనుమతించ బోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇదే అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున, అక్కడ నిర్ణయం వెల్లడయ్యే వరకూ విచారణను వాయిదా వేయాలని ఫేస్బుక్ ప్రతినిధి కూడా హైకోర్టును కోరారు. దీంతో, విచారణను అక్టోబర్ 1కి మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది.