Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులతో సీఎం విజయన్ సమీక్ష
తిరువనంతపురం : మోటారు వాహనాలు (సవరణ) చట్టం- 2019లో పేర్కొన్న జరిమానాలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని కేరళ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి పినరరు విజయన్ శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఆ సమావేశంలో దీనిపై తుది నిర్ణయానికి రాకపోయినప్పటికీ, జరిమానాలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ జరిమానాలను పెద్ద ఎత్తున పెంచడం 'అసహేతుకం, అశాస్త్రీయం' అని రవాణా మంత్రి ఎ.కె. శశీంద్రన్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వాహన చోదకులు అసమంజసమైన జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్నదని ఆయన అన్నారు. సమంజసమైన జరిమానాలను నిర్ణయించేందుకు రాష్ట్ర మోటారు వాహనాల విభాగం కసరత్తు చేస్తున్నది. చట్టంలోని ఇతర నిబంధనల విషయంలో న్యాయ శాఖ నుంచి సలహాలను తీసుకుంటున్నది. తమ ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకం కాదని, అసమంజసంగా జరిమానాలు పెంచడం, నిర్భంధంగా చట్టాన్ని అమలుపరిచే విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నదని ఆయన చెప్పారు. న్యాయశాఖ మంత్రి ఎ.కె. బాలన్, చీఫ్ సెక్రటరి టామ్ జోస్, పోలీస్, మోటారు వాహనాలు, న్యాయ విభాగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.