Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రయాన్ 98 శాతం సక్సెస్
- ల్యాండర్తో సంబంధాలు పునరుద్దరించలేకపోయాం : ఇస్రో చైర్మెన్ శివన్
భువనేశ్వర్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తదుపరి ప్రాధాన్యత గగన్యాన్ అని ఆ సంస్థ చైర్మెన్ కె. శివన్ వెల్లడించారు. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 98శాతం విజయవంతమైందని తెలిపారు. భువనేశ్వర్ ఐఐటీ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొనడానికి ఒడిషా రాజధానికి వచ్చిన శివన్.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ల్యాండర్ విక్రంతో మాత్రం సంబంధాలు పునరుద్ధరణ కాలేదని చెప్పారు. అయితే ఆర్బిటార్ పని తీరు మాత్రం చక్కగానే ఉన్నదనీ.. అందులోని ఎనిమిది సాంకేతిక పరికారాలు వాటికి ఉద్దేశించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయని శివన్ తెలిపారు. ల్యాండర్ విక్రంతో సంబంధాలను పునరుద్ధరించలేకపోయామన్న ఆయన.. అందులోని వైఫల్యాలను విశ్లేషించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణను చేపడతామన్నారు. కాగా, ల్యాండర్ విక్రం జీవితకాలం ఇప్పటికే ముగిసిపోయింది. ఇక తమ తదుపరి లక్ష్యం గగన్యాన్ అని ఈ సందర్భంగా శివన్ చెప్పారు.
భారత్ తరఫున అంతరిక్షంలో తొలిసారిగా మానవ సహిత ఉపగ్రహాన్ని పంపే కార్యక్రమమే గగన్యాన్. చంద్రయాన్-2 తర్వాత ఈ ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. 2020 డిసెంబర్, 2021 జులైలలో వరుసగా రెండు మానవ రహిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడాన్ని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం 2021 డిసెంబర్ నాటికి మానవ సహిత ఉపగ్రహాన్ని ప్రయోగించడాన్ని ఇస్రో నిర్దేశించుకున్నది. కాగా, గగన్యాన్కు అయ్యే ఖర్చు రూ.10 వేల కోట్లుగా అంచనా. గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించేందుకు ఇస్రో ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేసింది. వారికి మొదట భారత్లో ఆ తర్వాత రష్యాలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నారు. గగన్యాన్ ప్రయోగం విజయవంతమైతే.. అంతరిక్షంలోకి స్వతంత్రంగా మానవుడిని పంపిన నాలుగోదేశంగా భారత్ నిలువవనున్నది.