Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 డిమాండ్లలో ఐదింటికి ఓకే
ఢిల్లీ : తమ డిమాండ్లకు పరిష్కారం కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వేలాది మంది యూపీ రైతులు చేపట్టిన పాదయాత్రకు భయపడి ప్రభుత్వం దిగొచ్చింది. అన్నదాతల 15 ప్రధాన డిమాండ్లలో ఐదింటికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒప్పుకున్నది. మిగిలిన డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు. మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని.. ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరిస్తే మళ్లీ నిరాహార దీక్షతో భారీ ఆందోళనకు దిగుతామని కేంద్రాన్ని వారు హెచ్చరించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో ఈనెల 11న వేలాది మంది రైతులు యూపీలో సహరన్పూర్ జిల్లా నుంచి ఢిల్లీ లోని కిసాన్ ఘాట్కు పాదయాత్రను చేపట్టారు. చెరకు బకాయిలు, రుణమాఫీ, రైతులకు తక్కువ రేటుకు కరెంటు అందించడం, స్వామినాథన్ కమిటీ సిఫా రసుల అమలు.. వంటి 15 ప్రధాన డిమాండ్ల ను పరిష్కారించాలని కోరుతూ అన్నదాతలు ఈ భారీ ఆందోళనకు పూనుకున్నారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రిత్వ శాఖ, రైతు సంఘం నాయకులకు మధ్య చర్చలు జరుగగా అవి విఫలమయ్యాయయి. దీంతో నోయిడాలోని ట్రాన్స్పోర్టునగర్ నుంచి రైతులు వారి పాదయాత్రను కొనసాగించారు. అనంతరం ఢిల్లీ-యూపీ సరిహద్దు వద్ద ఘాజీపూర్ లోని 24వ నెంబర్ జాతీయరహదారిపై రైతన్నల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే కూర్చొని నిరసనకు దిగారు. యూపీ, ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు అక్కడకు భారీగా చేరుకున్నాయి. ఫలితంగా జాతీయరహదారి స్తంభించిపోయింది. అనంతరం కృషిభవన్లో వ్యవ సాయ మంత్రిత్వశాఖ ప్రధాన సెక్రెటరీ, రైతు ప్రతిని ధుల బృందం మధ్య సాయంత్రం మళ్లీ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఐదు డిమాండ్లకు కేంద్రం ఒప్పుకున్నది. మిగతా డిమాండ్లను రెండు వారాల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు వారి నిరసన యాత్రను తాత్కాలికంగా ఆపేశారు.
హామీలు నిలబెట్టుకోకపోతే మహౌద్యమమే
'కేంద్రం హామీ అనంతరం 11 రోజుల మా పాదయాత్రను నిలిపేశాం. పదిరోజుల్లో ప్రధానిని కలిసిన అనంతరం తదుపరి మా కార్యాచరణను నిర్ణయిస్తాం' అని రాష్ట్రీయ కిసాన్ సంఘటన్ అధ్యక్షులు ఠాకూర్ పూరన్ సింగ్ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం నిలబెట్టుకోకపోతే సహరన్పూర్ జిల్లా నుంచే నిరాహార దీక్షలతో మరో భారీ ఆందోళనకు దిగుతామని మోడీ సర్కారును ఠాకూర్ హెచ్చరించారు.