Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా సిబ్బందే కారణం: కుటుంబ సభ్యుల ఆరోపణ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భద్రతా సిబ్బంది చేయిచేసుకుందని మనస్తాపం ఓ చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుల్వామా జిల్లా చండిగాం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం ప్రకారం.. యావర్ అహ్మద్ భట్ (15) చదువుకుంటూ ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అహ్మద్ బుధవారం సర్వీసింగ్ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా తాహబ్ గ్రామానికి సమీపంలో ఉన్న ఓ ఆర్మీ క్యాంపుపై గ్రానైడ్ దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అహ్మద్ అక్కడ్నుంచే వెళ్తున్నాడు. దీంతో ఈ దాడిలో బాలుడి ప్రమేయం ఉందని భావించిన భద్రతా సిబ్బంది అహ్మద్ను అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా బాలుడి గుర్తింపు కార్డు లాక్కొని అతనిపై చేయి చేసుకుంది. ఈ చర్యలతో మనోవేదనకు గురైన అహ్మద్.. ఇంటికెళ్లి ఎవరితో మాట్లాడకుండానే పడుకున్నాడు. మరుసటి రోజు జరిగిన విషయాన్ని సోదిరితో మాత్రమే చెప్పాడు. అనంతరం తన గదిలోకెళ్లి విషం తాగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ తెలియనివ్వలేదు. గురువారం సాయంత్రం తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచీ శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులపాటు చికిత్సనందించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో అహ్మద్ మృతి చెందాడు. అయితే అహ్మద్ చికిత్స పొందుతున్న సమయంలో ఎందుకిలా చేశావని తల్లిదండ్రులు అడగ్గా.. కాశ్మీర్ కోసం త్యాగం చేస్తున్నానని చెప్పినట్టు తెలిపారు. తమ కుమారుడి ఆత్మహత్యకు భద్రతా సిబ్బందే కారణమని వారు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలపగా, ఆర్మీపై వచ్చిన ఈ ఆరోపణలను ఇప్పటి వరకు సంబంధిత అధికారులెవరూ ఖండించలేదనీ ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది.