Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు రాయితీలిస్తే ఉపాధి రాదు...
- సంక్షేమ పథకాలకూ ఇబ్బందులు
- సామాన్యుల ఆదాయం పెంచడమే ఆర్థిక మాంద్యానికి పరిష్కారం..: మాజీ ఐఏఎస్ అధికారి ఈఎఎస్శర్మ
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి సర్కారు సామాన్యుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలి తప్ప సంపన్నులకు రాయితీలిస్తే ఉపాధి రాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. రాయితీలివ్వడంతో కోల్పోయే పన్నువాటా తగ్గి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు కూడా చిల్లులు పడతాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన కార్పొరేట్ పన్ను రాయితీ ప్రభావం ఎలా వుండబోతోందనే విషయంపై భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి వంటి ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన శర్మ స్పందించారు. ఆయన మాటల్లోనే...
న్యూఢిల్లీ: ''ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్ను సుమారు 10శాతం రాయితీ ఇచ్చారు. అలాంటి పన్ను రాయితీవల్ల కంపెనీలు ఉత్పత్తి పెంచుతాయనీ, తద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆమె వెల్లడించారు. లక్షా 45వేల కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో కొరత రావడం వల్ల ప్రజా సంక్షేమచర్యలు అమలు చేయలేవు. దాంతో నష్టపడేవారు పేద ప్రజలు, సామాన్య కుటుంబాలు. కార్పొరేట్ వ్యవస్థల మీద ప్రభుత్వానికి గల వ్యామోహానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలకు ఆ కార్పొరేట్ సంస్థలే పెద్ద ఎత్తున ఎన్నికల్లో విరాళాలు ఇస్తున్నాయి. అందువల్లనే ప్రభుత్వ విధానాలు కార్పొరేటు సంస్థలకు లాభాలు కలిగించే విధంగా ఉంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర నష్టం...
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకు రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన రాయితీ వల్ల కేంద్రానికి పన్ను ఆదాయం రూ. 1,45,000 కోట్లకు పైగా తగ్గిపోతుంది. దీంట్లో రాష్ట్రాలకు వచ్చే 42 శాతం (రూ.61వేల కోట్లు) తగ్గిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే కంపెనీలకు లాభాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన నిధుల నుంచి రూ.61 వేల కోట్లు ఏటా కార్పొరేట్లకు తరలిస్తుందన్నమాట. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజల సంక్షేమానికి నష్టం రాదా?
సామాన్యుల స్తోమత పెరగాలి
ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ దేశంలో అత్యధికులు సామాన్యులు. వీరి ఆర్థిక స్తోమత పెరిగితేనే దేశీయంగా డిమాండ్ పెరుగుతుంది. పెద్దోళ్లకి సొమ్ములిచ్చి, పన్నుల రాయితీలిస్తే ఏం లాభం? ఈ దేశంలో దళితులకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకూ భూమి లేదు. వారికి భూమి సమకూర్చే విధానాలను పాలకులు అనుసరించడం లేదు. జీడీపీలో 15 నుంచి 20 శాతం వీధి వ్యాపారులు, చిల్లర కొట్టుల వారినుంచే వెళ్తున్నది. వీరు చిన్న పట్టణాలు, నగరాల్లో ఆక్రమించే స్థలం ఒక మారుతీ కారు పార్కింగ్ చేసినదానికంటే తక్కువ. కాబట్టి ఇలాంటి పేదల ఆర్థిక స్తోమత పెంచేలా ఆర్థికవేత్తలు, పాలకులు ఆలోచిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. సంపన్నులకు పన్ను రాయితీల వల్ల కానేకాదు.
క్యాష్లెస్ సొసైటీగా మార్చారు..!
నోట్లరద్దు చర్య తర్వాత సామాన్య పౌరుడి చేతుల్లో డబ్బు లేదు. సమాజాన్ని 'క్యాష్లెష్ సొసైటీ'గా నోట్ల రద్దు మార్చేసింది. 'భారతదేశంలో ఉత్పత్తి జనాభాలో 10 శాతం మందికి పనికొచ్చేదే చేస్తున్నారు. 90శాతం మంది వినియోగించే చెప్పులు, బట్టలు, వంటి చిల్లర వస్తూత్పత్తి, అమ్మకాలు జరగడం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ద్వారా చేసే కార్ల ఉత్పత్తితో వచ్చే లాభం ఎంత? పైన తెలిపిన 10 శాతం మందిలో ఒక వ్యక్తి ఒక కారు లేదంటే మూడు కార్లు కొనగల్గుతారనుకుంటే మిగతా 90శాతం జనం కార్లు కొనగలరా?
బ్యాంకుల దుస్థితికి కారణమెవరు?
గత కొన్ని సంవత్సరాలుగా బడా కార్పొరేట్ సంస్థలు పారుబకాయిలు పడడం వల్ల ఈరోజు జాతీయ బ్యాంకులు అధోగతి పాలవుతున్నాయి. కొన్ని కంపెనీలు తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేయడం, విదేశీ ఖాతాలకు తరలించడం కూడా అందరికీ తెలిసిందే. దీంతో సామాన్య పౌరులు నష్టపోతారు కదా! ఆర్థిక మంత్రి ఇప్పుడిస్తున్న పన్ను రాయితీలను ఆయా కంపెనీలు తీసుకుని మళ్లీ దుర్వినియోగపరచవన్న గ్యారెంటీ కూడా లేదు.