Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ఉదారవాద విధానాలవల్లే ఆర్థిక సంక్షోభం : పశ్చిమబెంగాల్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా
హుగ్లీ: ఎన్నార్సీ వంటి విద్వేషాలను వ్యాప్తి చేసే విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని పశ్చిమబెంగాల్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పిలుపునిచ్చారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాశ్మీర్ తరహా విధానాలకు ఎందుకు పాల్పడుతున్నదో, దాని వెనుక ఉన్న నిగూడార్థం గుర్తించాలని కోరారు.
మోడీ ఎన్నికల ప్రచారం కోసం బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేసిన నయా ఉదారవాద, ఆశ్రిత పెట్టుబడి దారుల అవినీతి కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. ఈ లక్ష్యంతోనే కాశ్మీర్ నుంచి ఎన్నార్సీ వరకు అనేక విధానాలను అధికార ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. ఈ విధానాల వల్ల అణగారిన ప్రజల్లో అనిశ్చితి నెలకొంటున్నదన్నారు. పట్టణ, గ్రామీణ పేదలు మిన్నకుంటున్నారన్నారు. పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఇప్పటికే నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు కారణమైన ఆయనపై పోలీసులు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరోసభ్యుడు ఎండి సలీమ్ తెలిపారు. జల్పారుగురిలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మహత్యలతో రాష్ట్రం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ ఆత్మహత్యలు రాష్ట్రంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అణగారిన ప్రజల పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. జిల్లాల స్థాయిలో కూడా నిర్వహించిన ఎన్నార్సీకి వ్యతిరేక ర్యాలీల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.