Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు
- ముగ్గురు మావోయిస్టులు హతం
- మృతుల్లో ఇద్దరు మహిళలు
విశాఖపట్నం : ఏపీలోని విశాఖ మన్యంలో ఆదివారం మధ్యాహ్నం తుపాకుల మోత మోగింది. పోలీసులకూ, మావోయిస్టులకూ మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరణిం చిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు మావోయిస్టు పార్టీ పిలుపులో భాగంగా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని మాది మళ్లు అన్నవరం కొండల్లో ఆదివారం ఆవిర్భావ దినోత్సవం జరగాల్సిఉంది. దీనికి స్థానికంగా కీలకమైన నాయకులు హాజరవుతున్నట్టు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో అన్ని వైపుల నుంచి మావోయిస్టులను చుట్టుముట్టినట్టు చెబుతున్నారు. దీనికి తగినట్టుగానే తొలుత ఈ సంఘటనలో ఐదుగురుహతమైనట్టు వార్తలు వచ్చాయి. వీరిలో ఒక ముఖ్యమైన మహిళా నేత ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిని పోలీస్ అధికారులు తోసిపుచ్చారు. ముగ్గురే మరణించారని మిగిలిన వారు తప్పించుకున్నారని వారు చెబుతున్నారు. గాయాలతో తప్పించుకున్న వారిలో చలపతి భార్య, మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ ఉన్నట్టు సమాచారం.
వీరితో పాటు మరికొందరు కూడా తప్పించుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం దారకొండ అడవీ ప్రాంతం వైపు పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. పోలీసు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం కచ్చితమైన సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లిన కూంబింగ్ బృందానికి మావోయిస్టు దళం తారసపడింది. దీంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంత మంది గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. మృతుల్లో గాలికొండ దళంలో పనిచేస్తున్న చెందిన కుంకుంపూడి గ్రామానికి చెందిన హరి ఉన్నట్టు తెలిసింది. హరి గతంలో పోలీసులకు లొంగిపోయి, మళ్లీ దళంలో తిరుగుతున్నట్టు సమాచారం. మృతులు ఎవరనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మృతిచెందిన మావోయిస్టుల నుంచి ఎస్ఎల్ఆర్ ఒకటి, 303 రెండు, కిట్ బ్యాగులు ఆరు, ఒక ల్యాండ్మైన్, 12 బోర్ తుపాకి ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు ఆలివ్ గ్రీన్ యూనిఫారలో ఉన్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి పొద్దుపోయే సమయానికి పోలీసు బలగాలు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాలేదు. మావోయిస్టులు ఎటూ వెళ్లలేక అటవీ ప్రాంతంలోనే ఉండి ఉంటారని భావిస్తున్నారు.
తప్పించుకున్న అరుణ?
ఈ కాల్పుల నుంచి తృటిలోనే కొందరు మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని, అందులో చలపతి భార్య అరుణ ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. కొంత కాలం క్రితం ఈస్ట్జోన్కు వచ్చిన అరుణ విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 23న నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య సంఘటనకు అరుణ నాయకత్వం వహించినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ కాల్పులతో ఏజెన్సీ 11 మండలాలను పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు.