Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: హర్యానాలో ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ అగ్రనేతలు సైతం నోరు జారుతున్నారు. తీవ్ర వ్యాఖ్యలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోనియాగాంధీని చచ్చిన ఎలుకతో పోల్చిన ఖట్టర్, వారసత్వ రాజకీయాల కోసం పార్టీని(కాంగ్రెస్ని) శిక్షించారని విమర్శించారు. హర్యానాలోని సోనీపట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్గాంధీ రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలపై ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల అన్వేషణ తర్వాత ఆ పార్టీ కొండను తవ్వి ఎలుకను పట్టిందని, అది కూడా చచ్చిన ఎలుక అంటూ ఖట్టర్ వ్యాఖ్యానించారు. సోనియాగాంధీని తిరిగి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, బీజేపీకున్న మహిళా వ్యతిరేక స్వభావానికవి నిదర్శనమని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఖట్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.