Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకింగ్రంగంలో మోడీ సర్కార్ అమలుజేస్తున్న సంస్కరణలు మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుందని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ చేయటమే పాలకుల అసలు ఉద్దేశమని వారు ఆరోపించారు. పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేయటాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. బ్యాంకుల విలీనంపై ఈనెలంతా నిరసనలు, ఆందోళనలు చేపడతామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈనేపథ్యంలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 3.50లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారని సమాచారం. అక్టోబరు 22న దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగసంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, బ్యాంకుల విలీనం పేరుతో జరిగేతంతు అంతా ప్రయివేటీకరణ కోసమేనని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మొండి బకాయిలతో అల్లాడుతున్నాయనీ, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినవారికి అనుకూలంగా మోడీ సర్కార్ వ్యవహరి స్తోందనీ, లక్షల కోట్ల రూపాయల్ని రైట్ ఆఫ్ చేస్తున్నారనీ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. సంస్కరణల పేరుతో చేస్తున్నదంతా కార్పొరేట్ కంపెనీలకు, బడా పెట్టుబడిదారులకు మేలు చేస్తుంది తప్ప బ్యాంకింగ్ వ్యవస్థకు మేలు చేయదని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ పేర్కొన్నది. బ్యాంకుల విలీనం ద్వారా శాఖల సంఖ్యను, అందులో పనిచేస్తున్న సిబ్బందిని తగ్గిస్తున్నారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.