Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
- జాతీయ పోషకాహార సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : తల్లి విద్యావంతురాలవటం ఆమె పిల్లల పౌష్టికాహారం, విద్య అంశాల్ని ప్రభావితం చేస్తోందని 'జాతీయ పోషకాహార సర్వే' తేల్చింది. 2016-18 మధ్యకాలంలో జరిగిన ఈ సర్వే వివరాల్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వేలో భాగంగా 1.2లక్షలమంది తల్లుల నుంచి సమాచారాన్ని సేకరించారు. పిల్లల చదువు, పౌష్టికాహారం, వివిధ రకాల రుగ్మతల నుంచి రక్షణ వంటి అంశాలు ఏవిధంగా ఉన్నాయి? అనే అంశాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సర్వే చేశారు. ఇందులో ముఖ్యంగా తల్లి విద్యావంతురాలైన సందర్భంలో ఎలాంటి ఫలితాలు నమోదైనది ఇందులో పేర్కొన్నారు.
ఈ సర్వేలో పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి, ఎంతో కొంత చదువుకున్న తల్లులు..తమ పిల్లలకు పౌష్టికాహారం అందించటంలో ఆసక్తికనబరుస్తున్నారు. సంపూర్ణమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మొత్తం తల్లుల్లో 20శాతం మాత్రమే ప్రీ-స్కూల్ పూర్తిచేసుకోగా, 7శాతం తల్లులు 12వ తరగతి చదువుకున్నారు. వీరంతా అన్నిరకాల ఆహార పదార్థాలతో తమ పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారని అధ్యయనంలో తేలింది. పాఠశాల విద్యకూడా లేని తల్లులకు సంబంధించి, వారి పిల్లల్లో రక్తహీనత, ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, పిల్లల్ని పాఠశాలకు పంపక పోవటం ఎక్కువగా నమోదైందని సర్వే తెలిపింది.