Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐలో అమిత్ షా తనయుడి ఎన్నికపై కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాలకవర్గం ఎన్నికలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన తండ్రి హయాంలో తాను బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికై ఉంటే 'బీజేపీ భక్తులు' ఏమని ఉండేవారో..అంటూ సెటైర్ వేశారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడుగా టీమిండియా మాజీ సారథి, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారిగా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ ఎన్నికయ్యారు.
గంగూలీ ఎన్నికపై ఓ వైపు ట్విటర్లో అభినందనలు వెల్లువెత్తుతుండగా.. మిగతా ఇద్దరి ఎన్నికపై మాత్రం కొందరు పెదవి విరిచారు. ఈ ఎన్నికలపై కార్తీ చిదంబరం బీజేపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ''యూపీఏ హయాంలో నా తండ్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు నేను బీసీసీఐ సెక్రటరీగా 'ఎన్నికై' ఉంటే.. 'మోడీ భక్తులు, బీజేపీ భజనపరులు ఎలా స్పందించి ఉండేవాళ్లో?' అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ)కి సంబంధించి జై షా ఎలాంటి పదవిలోనూ లేనప్పటికీ.. జీసీఏ తరపున బీసీసీఐ కార్యదర్శి కోసం ఆయనను నామినేట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.