Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో సీపీఐ(ఎం) 7 స్థానాల్లో, సీపీఐ 4స్థానాల్లో పోటీ
- దళితులు, నిర్మాణరంగ కార్మికులను నిలబెట్టిన వామపక్షపార్టీలు
న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలం, కండబలం ఏస్థాయిలో ఉందో మీడియాలో వస్తున్న వార్తా కథనాలే చెబుతున్నాయి. వందల కోట్ల రూపాయలున్నవారికి టికెట్ల పంపిణీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రాముఖ్యత ఇచ్చాయని చెప్పకతప్పదు. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని, పార్టీకోసం పనిచేస్తున్న వారికి టికెట్లు దక్కలేదన్న మాట వినిపిస్తోంది. డబ్బులు వెదజల్లే శక్తిసామర్థ్యాలున్నవారికి, గూండాయిజం చెలాయించేవారికి టికెట్ల పంపిణీలో ప్రాధ్యాన్యత ఇచ్చారని బీజేపీ, కాంగ్రెస్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీలోని అసలైన కార్యకర్తలు రెబల్స్గా పోటీ చేయాల్సి వస్తోంది. మరోవైపు వామపక్ష పార్టీలు సీపీఐ(ఎం), సీపీఐ ప్రజా సమస్యలపై పోరాడినవారికి ప్రాధాన్యత ఇస్తూ, టికెట్లు ఇచ్చింది. వివిధ అంశాలపై ఉద్యమాలుచేసిన దళితులు, నిర్మాణరంగ కార్మికులకు వామపక్షాలు టికెట్లు ఇవ్వటం గమనార్హం. రాజ కీయ పలుకుబడి, వ్యక్తిగత ఛరిష్మాను కాకుండా, ప్రజల కోసం జరిగిన పోరాటాల్లో వారి పాత్ర ఎలా ఉందన్నదాన్ని ప్రామాణి కంగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక జరిగిందని సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేందర్ మాలిక్ చెప్పారు. స్థానికంగా ప్రజలకు అనేక సమస్యలున్నాయనీ, వీటిని ఎన్నికల్లో చర్చనీయాంశం చేయబోతున్నామనీ ఫరీదా బాద్ స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్థి వీరేందర్ డాంగ్వాల్ అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగరేటు 28.7శాతం : సురేందర్ మాలిక్, సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి
గత ఎన్నికల్లో బీజేపీ చేసిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదు. 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని స్వయంగా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ఎన్నికల వాగ్దానం చేశారు. అందులో పదిశాతం ఉద్యోగాలు రాలేదు. రాష్ట్రంలో నిరుద్యోగరేటు 28.7శాతానికి చేరుకుంది. 4లక్షల ఉద్యోగ ఖాళీలుంటే, 4800 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశారు. అది కూడా ఎన్నికలున్నా యని వేశారు. ఈ పోస్టులకు 15లక్షల మంది దరఖాస్తు చేశారంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కార్మికుల్ని, మహిళా సంఘాల్ని ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి. వామపక్ష పార్టీలు అలా కాదు. ఉదాహరణకు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు వామపక్షాలు నాయకత్వం వహించాయి. ఈ సమ్మెవల్ల 9వేలమంది కార్మికుల వేతనాలు ఎంతోకొంత పెరిగాయి. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇవ్వాల్సి వచ్చింది. సస్సెండ్ చేసిన 365మంది కార్మికుల్ని విధుల్లో తీసుకుంది.
ప్రజాసమస్యలు ముందుకు రావటం లేదు..
వీరేందర్ డాంగ్వాల్, ఫరీదాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి
నేను ఒక సాధారణ మెకానిక్ వర్కర్ను. వామపక్ష పార్టీలతో నా మొదటి పరిచయం 1984లో అయ్యింది. 1987లో ఇక్కడ పెద్ద ఎత్తున కార్మికుల సమ్మె జరిగింది. ఆనాటి ప్రభుత్వం అందర్నీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. బన్సీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడి ఫ్యాక్టరీలో మెకానికల్ వర్కర్గా రిటైర్ అయ్యాక, సీపీఐ(ఎం) పార్టీలో చేరాను. ఎన్నో ఏండ్లుగా ఇక్కడి పరిస్థితులు చూస్తున్నా. అదేంటో...ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజల సమస్యలు ముందుకు రావు. ఫరీదాబాద్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొద్దిపాటి వర్షం కురిస్తేచాలు, ప్రాంతాలన్నీ మునిగి పోతున్నాయి. వీటిని పరిష్కరించాలన్న డిమాండ్ను తెరమీదకు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నా.