Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దహను నియోజకవర్గ పార్టీ అభ్యర్థి వినోద్ నికోలే గెలుపునకు కృషి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మహారాష్ట్రలో ఎన్నికల వేడి మొదలయింది. ఇన్నాళ్ళు రాష్ట్రంలోని రైతాంగాన్ని విస్మరించిన బీజేపీ, శివసేనలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నది. ఇటీవలి 300 మంది కార్యకర్తలు మూకుమ్మడిగా శివసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పాలఘర్ జిల్లాలో శివసేనకు చెందిన మరో 50 మంది ఆదివాసీ గిరిజన కార్యకర్తలు ఆ పార్టీని వదిలి సీపీఐ(ఎం)లో చేరారు. వారంతా దహను నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి వినోద్ నికోలే గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వారందరికీ ఆయన ఎర్ర కండువాలు కప్పి స్వాగతం పలికారు. సీపీఐ(ఎం) నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) స్థానిక కమిటీ నేత సుర్జీవేద్గా అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ దావలే, మరియం దావలే, లెఫ్ట్ అభ్యర్థి వినోద్ నికోలే, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బార్క్య మంగట్, కిసాన్ గుజార్ మాట్లాడారు. శివసేన నుంచి సీపీఐ(ఎం)లో చేరినవారిలో సిట్టింగ్ పంచాయతీ సమితి అధ్యక్షుడు విజరు నంగ్రే, నాగ్జారి గ్రామానికి చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్లు వసంత వాసవ్లా, ధులురాం టాండెల్లతో పాటు అనేక గ్రామాల సిట్టింగ్ గ్రామ పంచాయతీ సభ్యులు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను శివసేన-బీజేపీ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో తెలిపారు.
అలాగే ఎర్రజెండా వెంట ఉండేందుకు తాము నిర్ణయించుకున్నామని, వినోద్ నికోలే విజయం కోసం హృదయపూర్వకంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు లాహని దౌడా, జిల్లా కమిటీ సభ్యులు రమేష్ గుతే, నందు హడాల్, చంద్రకాంత్ ఘోర్ఖానా, కష్టకారి సంఘటన నాయకుడు మధుబాయి ధోడి పాల్గొన్నారు.