Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అర్థశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం
స్టాక్హోం : అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురికి వరించింది. పురస్కార గ్రహీతల్లో భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోకుతో పాటు మైఖేల్ క్రెమెర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం వీరు చేసిన కృషికి ఫలితంగా ఈ పురస్కారాన్ని ప్రకటించినట్టు రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. మానవాళిని కబళిస్తున్న పేదరికాన్ని సూక్ష్మస్థాయిలో ఎదుర్కోవడంపై ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అర్థశాస్త్రంలో వీరి పరిశోధనలు మంచి ఫలితాలను ఇవ్వడంతో వీరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. విద్యార్థుల డ్రాపవుట్ శాతాన్ని తగ్గించేందుకు అభిజిత్ బెనర్జీ ప్రయత్నించారు. అక్షరాస్యత శాతాన్ని పెంచారు.
ప్రశంసనీయం : ఏచూరి
అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సాధించిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభినందనలు తెలిపారు. ప్రెసిడెన్సీ, జెఎన్యు పూర్వ
విద్యార్థులపై జరుగుతున్న దుష్ప్రచారంలో పసలేదని ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ మరోసారి రుజువు చేశారని అన్నారు. ప్రపంచంలో పెరిగిపోతున్న పేదరికంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాన్ని నిర్మూలించేందుకు వారు చూపించిన మార్గాలు ప్రశంసనీయమని తెలిపారు.
మా నమ్మకం నిజమైంది : జెఎన్యు ప్రొఫెసర్లు
అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి రావడం పట్ల చాలా గర్వపడుతున్నామని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ పూర్వ ఆచార్యులు మీడియాకు తెలిపారు. తన పూర్వ విద్యార్థి అభిజిత్కు నోబెల్ రావడంతో ఆయనకు మెయిల్ పెట్టి అభినందించినట్టు ప్రొఫెసర్ అంజన్ ముఖర్జీ తెలిపారు. 'అభిజిత్ చాలా మంచి విద్యార్థి. 2008లో ఆయన పుస్తకం ప్రచురితమైంది. ఆ సమయంలోనే మేమంతా అతను ఈ అవార్డు సాధిస్తాడని ఊహించాం.' అని ఆయన పేర్కొన్నారు. జెఎన్యు వైస్ ఛాన్సలర్ ఎం.జగదీష్ కుమార్ అభిజిత్కు అవార్డు రావడం గర్వకారణమని ట్వీట్ చేశారు.
అభిజిత్ విధానాలు ఆదర్శప్రాయం : సోనియా
'ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు బెనర్జీ, ఆయన సహచరులు తన పరిశోధనలతో దేశం గర్వించే విధంగా చేశారు. ఆయన అనుసరించిన విధానాలు, ప్రయోగాలు ఆదర్శ ప్రాయమైనవి. ఆయన కృషికి నోబెల్ బహుమతి లభించడం భారతీయులను ఎంతో అనందింపజేసింది' అని కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'న్యారు' పథకాన్ని రూపొందించడంలో అభిజిత్ బెనర్జీ ఎంతో సహాయపడ్డారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ అభినందించారు. అదేవిధంగా అభిజిత్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలియజేశారు.