Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్హెచ్ఆర్సీ చైర్మెన్కు ఏపీ టీడీపీ బృంద విన్నపం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతలను, నేర విచారణ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని ఏపీ టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మెన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుకు టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఏపీలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను అందజేసింది. టీడీపీ నేతలను, కార్యకర్తలను, టీడీపీకి ఓటు వేసిన ప్రజలను వేధిస్తూ, బాధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని కోరింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ అత్యధిక స్థానాలకు ప్రజలు ఓటు వేశారనీ వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. ప్రతిపక్ష పార్టీ నేతలను, కార్యకర్తలను, ఆ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ప్రజలను లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నేతల వరకు క్షేత్ర స్థాయిలో హింసను సృష్టిస్తున్నారని తెలిపింది. తప్పుడు ఫిర్యాదులతో తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించింది. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్తో ప్రచారం చేసుకుంటున్నారనీ, సోషల్ మీడియా ప్రతినిధులతో రాజకీయ ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేయిస్తున్నారని తెలిపింది.