Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో హిందువుల తరఫు న్యాయవాది
న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీద్, రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రాముని జన్మస్థలమైన అయోధ్యలో మసీదు నిర్మించి, బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని, ఇప్పుడు దానిని సరి చేయాల్సి ఉన్నదని హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ వాదన వినిపించారు. చీఫ్జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారంతో రోజువారీ విచారణను పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
మంగళవారం మహంత్ సురేశ్దాస్ తరఫున పరాశరన్ వాదన వినిపించారు. సున్నీవక్ఫ్బోర్డు, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యంలో మహంత్ ప్రతివాది. అయోధ్యలో చాలా మసీదులున్నాయి. ముస్లింలు వాటిలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చునని పరాశరన్ సూచించారు. రాముని జన్మస్థలాన్ని హిందువులు మార్చుకోలేరని ఆయన అన్నారు. పరాశరన్కు న్యాయమూర్తులు పలు ప్రశ్నలు వేశారు. 1992, డిసెంబర్ 6న కూల్చివేతకు గురైన మసీదు ప్రాంతంలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం తమకే ఇవ్వాలని ముస్లింలు ఎందుకు కోరకూడదు..? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకసారి మసీదుగా ఉన్న స్థలం ఎప్పటికీ మసీదే అని వారంటున్నారు. దీనిని మీరు సమర్థిస్తారా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు బదులిస్తూ తాను సమర్థించనని పరాశరన్ తెలిపారు. ఒకసారి ఆలయంగా ఉన్నది ఎప్పటికీ ఆలయమేనని పరాశరన్ అన్నారు. ఈ కేసులో దాఖలైన మొత్తం 14 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. దీనిపై ఇరుపక్షాల వాదనలను వినడం పూర్తి చేసిన తర్వాత తీర్పును రిజర్వ్లో పెట్టనున్నారు. నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా తీర్పు వెల్లడించే అవకాశమున్నట్టు చెబుతున్నారు.