Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తత గ్రామంపై హర్యానా సీఎం ఖట్టర్ అశ్రద్ధ
- కనీస మౌలిక సదుపాయాలూ కల్పించడంలో విఫలం
- కియోరాక్ గ్రామస్థుల ఆగ్రహం
చండీగఢ్ : బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో సీఎం మనోహర్లాల్ ఖట్టర్ తాను దత్తత తీసుకున్న కియోరాక్ గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కైతాల్ జిల్లాలోని అతిపెద్దదైన ఈ గ్రామాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు పెట్టించి 'ఆదర్శ గ్రామం'గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. దాదాపు ఐదేండ్ల కిందట 'విధాయక్ ఆదర్శ్ గ్రామ్ యోజనా' కింద కియోరాక్ను ఖట్టర్ దత్తత తీసుకున్నారు. కానీ, ఐదేండ్లు గడిచినా అక్కడ అభివృద్ధి మాత్రం పడకేసింది. మరికొన్ని పన్నులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకొన్నింటిలో అవినీతి చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాలయకూ నోచుకోలేక కియోరాక్ గ్రామస్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల్లో ఉపాధ్యాయులు కరువు
ఈ గ్రామంలో నాలుగు పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఇందులో బాలబాలికల కోసం రెండు ప్రాథమిక.. మరో రెండు ఉన్నతస్థాయి పాఠశాలలు ఉన్నాయి. అయితే గత కొన్ని నెలల నుంచి ప్రాథమికస్థాయి పాఠశాలల్లో మాత్రం హెడ్మాస్టర్లే లేరు. అలాగే హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ప్రిన్సిపాళ్ల భర్తీ కూడా జరగలేదు. ఒక స్కూల్కు ప్రిన్సిపాల్ను నియమించినప్పటికీ సదరు వ్యక్తి ఇప్పటి వరకూ బాధ్యతలు చేపట్టకపోవడం గమనార్హం. ఆరు నెలల నుంచి బాలుర ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే పాఠాలు బోధించడానికి టీచర్లు కూడా లేకపోవడం గ్రామంలో పాఠశాలల పనితీరుకు అద్దం పడుతున్నది.
అభివృద్ధి పనుల్లో అవినీతి
ఇక మౌలికసదుపాయల అభివృద్ధి అయిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతేడాది నవంబర్లో జిల్లా ఉన్నతాధికారులు విడుదల చేసిన తనిఖీ నివేదిక సమాచారం ప్రకారం.. 2017లో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకున్నట్టు తేలింది. అనధికారిక లెక్కల ప్రకారం.. ఈ గ్రామంలో దాదాపు 21వేల మంది ప్రజలు ఉంటారు.
వివిధ మౌలికసదుపాయాల అభివృద్ధి పనుల కోసం రూ. 17 కోట్లను గ్రామానికి కేటాయించారు. అయితే ఖర్చు చేసిన వాటికి.. చూపించి లెక్కలకు పొంతన లేదని సామాజిక కార్యకర్త సేత్ పాల్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా సమాచారం వెల్లడికావడం గమనార్హం. దీనిపై సీఎం కార్యాలయానికి గతేడాది మార్చిలో సేత్పాల్ ఫిర్యాదు చేయగా.. అవినీతిపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. కాగా, ఈ అవినీతిలో గ్రామసర్పంచ్ బల్కార్ ఆర్య నిందితుడిగా ఉన్నారు. రికవరీ నోటీసును అందుకున్న తర్వాత సదరు గ్రామసర్పంచ్.. తాను అపహరించిన నిధులను పంచాయతీకి అందజేసినట్టు సమాచారం.
లింగ నిష్పత్తి దారుణం
మోడీ మానసపుత్రికగా చెప్పుకొనే 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం అమలు సీఎం దత్తత గ్రామంలోనే సరిగ్గా అమలు కావడం లేదు. రోడ్డుకిరువైపులా చెత్తాచెదారం జమకావడంతో కుక్కలు, పందులు, ఈగలు, దోమల సమస్య పెరిగిపోయింది. ఫలితంగా చుట్టుపక్కల నివసించే స్థానికులు అనారోగ్యాల పాలయ్యి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇక గ్రామానికి కేటాయించిన 'ఆహార ధాన్యాల స్టోరేజీ' మురికి కూపంగా మారిపోయింది. అక్కడ చెత్తా, చెదారంతో పాటు నీరు నిలిచిపోయి తీవ్ర సమస్యలకు కారణమవుతున్నది. ఇక్కడ మురుగునీటి కాలువల నిర్మాణమూ సరిగ్గాలేదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మించిన మరికొన్ని కాలువల్లో మురుగునీరు పరిమితిని మించి ప్రవహించి రోడ్లపైకి వచ్చి చేరుతున్నది. దీంతో గ్రామంలోని రోడ్లు, మార్కెట్లలో మురుగునీరు నిలిచిపోతున్నది. ఇక గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. కియోరాక్ గ్రామంలో లింగ నిష్పత్తి 839గా ఉన్నది. హర్యానా రాష్ట్ర సగటు నిష్పత్తి 879 కంటే కూడా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.
'గ్రామంలో అభివృద్ధి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మూడేండ్ల నుంచి గ్రామంలో మురుగు నీటి కాలువల నిర్మాణం జరుగుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక కాలువల్లో మురుగు నీరు పరిమితిని మించి ప్రవహించి రోడ్లపైకి చేరుకుంటున్నాయి. స్కూళ్లలో కావాల్సిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేరు' అని భుల్లర్ రాం(70) అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తమ గ్రామ అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యం వహించడాన్ని గ్రామస్థులు తప్పుబడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుతో బీజేపీకి తగిన సమాధానం చెప్తామని ఇక్కడి ప్రజలు అంటున్నారు.