Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై బీహార్ ప్రజల్లో ఆగ్రహం
- వరదల కారణంగా ప్రబలుతున్న డెంగ్యూ
పాట్నా : డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పరామర్శించడానికి బీహార్కు వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అశ్విన్ కుమార్ చౌబేకు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే పప్పూ యాదవ్ అనుచరుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఆయనపై సిరా చల్లాడు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై చౌబే స్పందిస్తూ.. 'ఇది నా మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఈ ఘటన వెనుక ఉన్న నాయకులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. దీనిపై పప్పూ యాదవ్ స్పందిస్తూ.. చౌబేపై దాడిని ఖండిస్తున్నాననీ, కానీ ఇది అధికారంలో ఉన్న వారిపై ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తున్నదని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు.
విజృంభిస్తున్న డెంగ్యూ..
గతనెల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో సర్వం కోల్పోయిన బీహార్ ప్రజలు ఇప్పుడు రోగాల బారీన పడుతున్నారు. వరదల అనంతరం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా డెంగ్యూ విజృంబిస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో సుమారు 1,500 మందికి పైగా డెంగ్యూ ఉన్నట్టు గుర్తించగా.. వారిలో 1,200 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇందులో 900 మంది పాట్నా నుంచే ఉన్నారు. పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో 80 మంది డెంగ్యూ బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత నానాటికీ ఎక్కువవుతుండటంతో సీఎం నితీశ్కుమార్ దీనిపై వైద్యాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇదిలాఉంటే డెంగ్యూ సోకి రెండ్రోజుల క్రితం పాట్నాలో ఓ చిన్నారి మరణించాడు. డిగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరేసియాకు సైతం డెంగ్యూ సోకి ఆస్పత్రిలో చేరారు. కాగా, ఓవైపు డెంగ్యూ ప్రబలుతుంటే దానిని అదుపుచేయడానికి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం.. సరైన విధంగా స్పందించటం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో ఫాగింగ్ చేయడం లేదనీ, దీంతో ఇప్పటికే బురదమయమై ఉన్న ప్రాంతాల్లో దోమలు, విష కీటకాలు ఎక్కువవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. వరద సహాయక చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపైనా వారు అసహనంగా ఉన్నారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సైతం ప్రజల ఆగ్రహానికి గురైన విషయం విదితమే.