Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలతో సర్వస్వం కోల్పోయిన కన్నడ రైతులు
- సుమారు 2.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం
- ఇప్పటికే ఆరుగురు అన్నదాతల ఆత్మహత్య
బెంగళూరు : ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలతో సర్వం కోల్పోయిన కన్నడ రైతులకు పరిహారం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. తమకు నష్ట పరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో ఉత్తర కన్నడ, బెల్గావి, కొడుగు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ జిలా ్లల్లో రైతులు సుమారు 2.20 లక్షల హెక్టార్లలో పంటలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదలతో ఇండ్లు కూడా నేలమట్ట మయ్యాయి. అయితే, వరద సహాయక చర్యల కింద తమకు రూ. 3 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్రంలోని బిఎస్ యడి యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కారు చేసిన విన్నపాన్ని కేంద్ర సర్కారు పట్టించుకోలేదు. అడిగినదానికంటే సగానికి తక్కువగా.. రూ. 1,200 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుంది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. వరదల దాటికి బెల్గావిలోనే రూ. 11 వేల కోట్లు నష్టం వాటిల్లిందని అధికా రులు అంచనా వేశారు. కానీ జిల్లాకు ఇప్పటివరకు కేవలం రూ. 867 కోట్ల సహాయక నిధులను మాత్రమే విడుదల చేశారు. జిల్లాలోని 14 తాలూకాలు వరదలకు అతలాకుత లమయ్యాయి. ఇందులో పంట నష్టం రూ. 3,229 కోట్లు, ఇండ్లు కోల్పోయిన ఘటనల్లో రూ. 3 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కానీ, బీజేపీ సర్కారు నామమాత్రపు సహాయంగా ప్రకటించిన కుటుం బానికి రూ. 10 వేలు సైతం మరో 3వేల కుటుంబాలకు అందలేదు. ఇదిలాఉంటే పంట నష్టం అంచనావేయడంలో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర అధికారుల అంచనాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలోని 504 గ్రామాల్లో వరదల దాటికి సుమారు రూ. 60 కోట్ల పంట నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు అంచనావేయగా.. ఎన్డీఆర్ఎఫ్ మాత్రం రూ. 7.14 కోట్లని తేల్చింది. ఈ నిధులూ విడుదల కాలేదు.
దీనిని నిరసిస్తూ వరద బాధిత జిల్లాల రైతులు నిరసనలకు దిగారు. ఈనెల 11న బెంగళూరులోని విధానసభను ముట్టడించడానికి యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సెవడిని రైతులు నిలదీయగా.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. వారం రోజులు కావస్తున్నా ఆయన ఇంతవరకూ దీనిమీద ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. పంటలు కోల్పోయి, పరిహారం అందక ఇప్పటికే ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాగా, కొడుగు జిల్లాను నేషనల్ డిజాస్టర్ జోన్గా ప్రకటించాలనీ, తమకు రావాల్సిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.