Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ ఆఫీసు ఖాళీ చేయాలంటూ డీన్ ఓవరాక్షన్
- ఖండించిన స్టూడెంట్ యూనియన్స్, ప్రజాస్వామికవాదులు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డీన్ ఓవరాక్షన్తో రగడ మళ్లీ మొదలైంది. జేఎన్యూఎస్యూ కార్యాలయాన్ని సాయంత్రం ఐదు గంటలలోగా ఖాళీ చేయాలంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వామపక్ష విద్యార్థి సంఘాలకు వర్సిటీ డీన్ హుకుం జారీచేశారు. విద్యార్థి సంఘం నేతలు లింగ్డో కమిటీ సిఫార్సులను పాటించడంలేదంటూ వర్సిటీ డీన్ ఉమేష్ అశోక్ ఈ మేరకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రదేశాన్ని దుర్వినియోగ పరిచే హక్కు, అధికారం ఎవ్వరికీలేదని లేఖలో తెలిపారు. అయితే, దీనిపై వర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు భగ్గుమన్నారు. యూనివర్సిటీ చర్యలపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. డీన్ నిరంకుశ ప్రకటనకు వ్యతిరేకంగా యూనివర్సిటీలోని విద్యార్థి సంఘం కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించాయి. వర్సిటీ యాజమాన్యం తీసుకున్న ఈ నియంతృత్వ నిర్ణయాన్ని తాము అడ్డుకుంటామని తెలిపాయి. ఢిల్లీ హైకోర్టు సైతం తమ ఎన్నికను ధ్రువీకరించిన విషయాన్ని వర్సిటీ యాజమాన్యం గుర్తుంచుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు మయూక్ బిశ్వాస్ అన్నారు. యూనియన్ ఎన్నికల చట్టబద్ధతని కోర్టు గుర్తించినా, వర్సిటీ పెద్దలకు ఇంకా అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్నీ, యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే, విద్యార్థి సంఘాలను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఖాళీ చేయించే యత్నాలు ఆపండి : సీఐటీయూ
నియంతృత్వ పోకడలను వర్సిటీ డీన్ తక్షణమే ఆపాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయాన్ని ఖాళీ చేయించే యత్నాలను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.