Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మేం ఉద్యమకారులం.. మాకు ఏది ఎప్పుడు, ఎలా చేయాలో బాగా తెలుసు...' అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. 'ట్రాన్స్ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్నెస్ ఇన్ తెలంగాణ' అనే అంశంపై బుధవారం హైదరాబాద్లోని అర్థగణాంకశాఖ కార్యాలయంలో నిర్వహించిన సెమినార్లో వినోద్కుమార్ మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే తమ ఏకైక అజెండా అని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థిక, ప్రణాళికాశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కోరారు. తద్వారా అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం అర్థగణాంక, ప్రణాళికాశాఖలు పలు అంశాలకు సంబంధించి పక్కా వివరాలు సేకరించాలని కోరారు. రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం.. సేజిస్ అనే సంస్థతో ఈ సందర్భంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను నిటి అయోగ్ సలహాదారుడు మురళీధరన్ కార్తికేయన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మార్చుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు జీఆర్ రెడ్డి, అర్థగణాంకశాఖ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ప్రణాళికాశాఖ డైరెక్టర్ షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారికి పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ బుధవారం పరామర్శించారు. హైదరాబాద్లోని కొంపల్లిలోగల సురక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాఘవాచారిని పరామర్శించిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాఘవాచారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.