Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రసంగాల్లో ప్రతీదీ తన గురించే..
- మంత్రులు, ఎంపీల పేర్లూ రాకుండా జాగ్రత్త
- తనను తానూ మూడో వ్యక్తిగా పరిచయం
- పలు సమావేశాల్లో ఇదే తీరు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పాల్గొనే ప్రతి బహిరంగ సమావేశంలో ప్రజలనుద్దేశిస్తూ చేసే ప్రసంగాల్లో ప్రతీదీ 'తన గురించే' చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. ''బీజేపీలో.. ప్రభుత్వ పాలనలో.. అంతా నేనే..'' అన్న విధంగా మోడీ వన్మ్యాన్ షోను ప్రదర్శించాలనుకుంటున్నారు. తాను చేసే ప్రసంగాల్లో.. పాలనకు సంబంధించిన అంశాల్లోనూ మంత్రులు, ఎంపీల పేర్లు రాకుండా మోడీ తన గురించే వివరించడం అనేక సందర్భాల్లో చోటు చేసుకున్నది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచార ర్యాలీలు, సమావేశాల్లో భాగంగా మోడీ దాదాపు 32 గంటలు గంటలు ప్రసంగించారు. అయితే వీటిలో ''తన గురించి తాను'' చెప్పుకోవడం ప్రతి ప్రసంగంలో సాధారణంగా కనిపించింది. తన విధానాలు, విజన్ను పొగుడుకోవడం.. ఇలా 'సొంత డబ్బానే' ఎక్కువగా కనిపించింది. అయితే ఇలాంటి విధానం పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఏ మాత్రం మంచిది కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇందిరా, రాజీవ్ హయాంలోనూ కాంగ్రెస్లో వన్మ్యాన్ షో నడిచింది. పార్టీలో, ప్రభుత్వంలో వారే సుప్రీం. అయితే ఇందిరా మరణం తర్వాత కానీ, రాజీవ్ హత్యానంతరంకానీ నాయకత్వం పరంగా పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొన్నది. ఇందిరా, రాజీవ్ లాంటి నాయకుల స్థానాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు సైతం భర్తీ చేయలేకపోయారు. ఇందిరా, రాజీవ్ హయాంలో పార్టీలో రెండో తరం నాయకులను తయారు చేయలేకపోవడంతోనే కాంగ్రెస్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు ట్రంప్ది కూడా ఇదే వైఖరి. ప్రసంగాల్లో తన గురించి, తన విధానాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీడియాకు దూరంగా ఉంటారు.
తాను మాత్రమే హైలెట్ అయ్యేలా..
దాదాపు ఇదే తీరును మోడీ ప్రదర్శిస్తున్నారు. మోడీ చేసే ప్రసంగాల్లో తాను మాత్రమే హైలెట్ అయ్యే విధంగా చూసుకోవడం పలు సందర్భాల్లో కనిపించింది. కష్టాలు కొని తెచ్చుకోవడం ఇష్టంలేక మీడియాతో మోడీ దూరాన్ని పాటిస్తూ వచ్చారు. అలాగే పార్టీ నాయకులు కానీ, మంత్రులు, ఎంపీల పేర్లను కానీ తన ప్రసంగాల్లో రానీయకుండా మోడీ జాగ్రత్త తీసుకున్న సందర్భాలూ కనిపించాయి. తనను తాను 'మూడో వ్యక్తి'గా పేర్కొంటూ ప్రజలను ఒక భ్రమలోకి నెట్టేసిన సందర్భాలూ అనేకం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న యూపీలోని బాందాలో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో దాదాపు 41 నిమిషాలు ప్రసంగించిన మోడీ.. నేరుగా తన పేరును వెల్లడించకుండా.. తనను తాను 'మూడో వ్యక్తిగా' 30 సార్లు ఉటంకించడం గమననార్హం. మరికొన్ని సందర్భాల్లో పథకాల ప్రచారం కోసం తన కుటుంబసభ్యుల పేర్లను ఉటంకిస్తూ చేసిన ప్రసంగాలున్నాయి. మరుగుదొడ్ల అవసరాన్ని తెలియజేసే క్రమంలో.. ' పేదరికం కారణంగా నా తల్లి బహిర్భూమి కోసం బటయకు వెళ్లడం చూసి నేను చలించిపోయాను' అని తన ప్రచార ప్రసంగాల్లో తల్లిని పేరును కూడా మోడీ వాడుకోవడం కనిపించింది.
వన్మ్యాన్ షో..బీజేపీకే నష్టం
అయితే ఇలా 'వన్ మ్యాన్ షో' అనేది పార్టీకి, ప్రభుత్వానికి ఏమంత ఆమోదయోగ్యం కాదని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2014, 2019లలో కానీ, సోషల్మీడియాలో కానీ, సాధారణ మీడియాలో కానీ, మోడీ పేరు వినబడేలా ప్రధాని 'అనుచర యంత్రాంగం' ఎంతగానో జాగ్రత్తలు తీసుకున్నది. బీజేపీ అంటే మోడీ అన్న విధంగా అందులో ప్రచారాలు జరిగాయి. పార్టీ అధికారంలోకి రావడానికి ఇది దోహదం చేసినప్పటికీ ఈ విధానం బీజేపీకే నష్టం చేకూర్చే అవకాశం ఉన్నదని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ రాజకీయాల నుంచి మోడీ తప్పుకుంటే బీజేపీలో అధికార శూన్యత తప్పక ఏర్పడుతుందనేది వాస్తవం. రెండో తరం నాయకులను ఎదగనీయకుండా మోడీ అనుసరించిన విధానాలు కాషాయపార్టీని అంధకారంలోకి నెట్టేయడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అమిత్షా.. పేరు వినబడుతున్నప్పటికీ ప్రాక్టికల్గా అది అంత సులువుకాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. 'వన్ మ్యాన్ షో' ఏ పార్టీకి మంచిది కాదనీ, గతంలో కాంగ్రెస్ ఇదే పంథాతో వెళ్లి నష్టపోయిందనీ.. ఇప్పుడు బీజేపీ కూడా అదే తీరును పాటిస్తున్నదని వారు అంటున్నారు. మోడీ తీరుపై సొంత పార్టీలో కొందరు సీనియర్లు, రెండో తరం నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన తీరు నచ్చక ఇప్పటికే శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నాయకులు బీజేపీని వీడిన విషయం తెలిసిందే.