Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది
- ఓట్లేయబోమంటున్న నర్మదా వాలీలోని గ్రామస్తులు
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చిరమాంకానికి చేరుకుంటున్నది. ఓటర్లను ఆకర్షించటానికి రాజకీయపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ సమయంలో ఓ గ్రామం ఎదురుతిరిగింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందనీ, అందుకు నిరసనగా తాము ఓటువేయబోమని స్పష్టంచేసింది. అదే ఉత్తర మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని మనిబెలి గ్రామం. ఇది మహారాష్ట్ర యొక్క ఎన్నికల జాబితాలో వున్న మొదటి గ్రామం. కాగా, ఇక్కడి ఓటర్ల సంఖ్య 135.
విద్యుత్ లేదు.. రహదారి అనుసంధాంలేదు...
72 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యంలేదు, రహదారి అనుసంధానంలేదు. దేశంలో 100శాతం విద్యుదీకరణ సాధించినట్టు ఒకపక్క కేంద్రం ప్రకటిస్తుండగా, తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడి ఆ గ్రామస్తులు అలిసిపోయారు. 'ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. విద్యుత్తు, రహదారి కోసం ఏండ్లపాటు జరిపిన మా సుదీర్ఘ పోరాటం విజయవంతం కాలేదు. ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎనిమిది కిలో మీటర్ల రోడ్డు వేసేందుకు రెండేండ్ల కింద ఆమోదం లభించింది. కానీ, అది కూడా కార్యరూపం దాల్చలేదు. రాజకీయ నాయకులతో రోడ్డు నిర్మాణం పని అవుతుందన్న ఆశను కోల్పోయాం. ఎన్నికల సమయంలో నిరసన తెలిపేందుకు మాకు ఇప్పుడు మరో అవకాశం వచ్చిందని భావిస్తున్నాం' అని గ్రామస్తుడు నట్వర్ భారు తద్వి (60) చెప్పారు.
ఈ గ్రామం అటవీప్రాంతం మరియు గిరిజన ప్రాబల్యం ఉన్న నందూర్బార్ జిల్లా శివారు ప్రాంతంలో వుంది. గ్రామం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో తొలిస్థానంలో వున్న అక్కల్కువా తహసీల్ పరిధిలోనిది.
'ఇక్కడ విచిత్రమేమంటే.. గుజరాత్లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట, ఐక్యతా విగ్రహం యొక్క దీపాల వెలుగులు మా గ్రామం నుంచి రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తూ వుంటాయి. కానీ, రాజకీయ నాయకులు మా కోసం ఏమీ చేయలేదు' అని మనిబెలి గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ్ తద్వి ఆరోపించారు. 'విద్యుత్ కనెక్షన్, ఇతర ప్రభుత్వ పథకాల కోసం మా గ్రామ పంచాయతీ ఎప్పుడు అధికారులను కలిసినా.. మా విజ్ఞాపనలు తిరస్కరణకు గురవుతున్నాయి. ముంపు పరిధిలో మా గ్రామం ఉందని చెబుతున్నారు..' అని గ్రామ వాసి మనిలాల్ తాడ్వీ వాపోయారు. 100శాతం విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర చేరిందని నేతలు ఎప్పుడో ప్రకటించారు. చీకట్లోనే ఉన్న మా గ్రామం వారికి గుర్తుకు రావటంలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. 100శాతం గృహ విద్యుదీకరణ సాధించిన 25 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రను 2018 డిసెంబరులో చేర్చటం గమనార్హం.