Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ఐఐఎంఏ విద్యార్థులు, అధ్యాపకులు, పలువురు ప్రముఖులు
- కేంద్రం వైఖరిపై ఆగ్రహం
అహ్మదాబాద్ : జమ్మూకాశ్మీర్లో సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షలను ఎత్తేసి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కోరుతూ ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు, అధ్యాపకులు, పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా కాశ్మీరీలకు సంఘీభావంగా ఐఐఎంఏ క్యాంపస్ బయట జరిగిన ఈ కార్యక్రమానికి వారంతా హాజరయ్యారు. ఒక చేత్తో కొవ్వొత్తులను చేతబూని, మరొక చేతిలో కాశ్మీరీలకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ ఆందోళనను వెలిబుచ్చారు. ఈ నిరసన ర్యాలీలో ఐఐఎంఏ ప్రొఫెసర్లు నవదీప్ మాథూర్, చిన్మరుతుంబే, ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రకాశ్ ఎన్ షా, హైకోర్టు సీనియర్ లాయర్ కెఆర్ కోష్టి, పౌరహక్కుల కార్యకర్తలు షంశద్ పఠాన్, దేవ్ దేశారు, ముజాహిద్ నఫీజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఐఐఎంఏతోపాటు అహ్మదాబాద్ యూనివర్సిటీ, సెప్ట్ వర్సిటీ, గుజరాత్ విద్యాపీట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) విద్యార్థులు, ఫ్యాకల్టీ కూడా నిరసనలో పాలుపంచుకున్నారు. కాశ్మీరీల హక్కులు హరించుకుపోతున్నాయనీ, వారికి బాసటగానే గొంతెత్తేందుకు వివిధ వర్గాల ప్రజలు ఇందులో భాగమయ్యారని మాథుర్ అన్నారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని ప్రొఫెసర్ తుంబే ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయలో నిర్బంధం తొలగిపోయి సాధారణ స్థితికి చేరుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరా తీసుకున్న చర్యలకు మించి కాశ్మీర్పై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ తీరు ఉన్నదని ప్రకాశ్ ఎన్ షా ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అనంతరం జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.