Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా 22వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టేందుకు బ్యాంకుల విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయని ఆల్ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) నేతలు విమర్శించారు. ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనానికి కేంద్రం ప్రతిపాదించిందని, దీనివల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, దీనివల్ల ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్లో ఎక్కువ పెనాల్టీలు విధించేలా కేంద్రం సంస్కరణలు చేస్తోందని, దీన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టు ఏఐబీఈఏ, బీఈఎఫ్్ఐ నేతలు ప్రకటించారు.
అలాగే ఎగవేతదారుల నుంచి రుణాలు రికవరీ చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, ఈ పనిచేస్తే బ్యాంకులు బలోపేతం అవుతాయనీ తెలిపారు. ఇవే డిమాండ్లతో గత నెలలో ప్రభుత్వరంగ బ్యాంకు అధికారుల యూనియన్లయిన ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్(ఏఐబీఓసీ), ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్బీఓసీ), నేషనల్ ఆఫీస్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్(ఎన్ఓబీఓ) మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్కుమార్ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నారు. ఆగస్టులో ప్రకటించిన విలీన ప్రతిపాదనల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకు యూనైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో విలీనం అవుతుంది.
సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుతోనూ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంకులోనూ విలీనం అవుతాయి. గతంలో ఎస్బీఐకి చెందిన ఆరు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకునూ కలిపేశారు. వచ్చే ఏడాది విజయబ్యాంకు, దేనాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాను విలీనం చేయనున్నాయి.