Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు బ్రిటిషర్లతో... నేడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం..
- ఉద్యమాలకు రైతాంగం, కార్మికులు, యువత మద్దతు : ప్రకాశ్ కరత్
అగర్తలా : బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారనీ, ఇందులో రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారనీ సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేవలం కమ్యూనిస్టులు మాత్రమే నిలబడగలరని ఆయన చెప్పారు. అగర్తలాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''స్వాతంత్రోద్యమంతో వచ్చిన సైద్ధాంతిక విలువల్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అందువల్లే ఆ పార్టీ ప్రజాదరణకు దూరమైంది. ఈ నేపథ్యంలో మోడీ-అమిత్ షాలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు మాత్రమే నిలబడగలరు. కాబట్టే దేశంలో కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలకు రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది'' అని అన్నారు.
వలసపాలకుల్ని తరిమేశాం...
బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన అనుభవం కమ్యూనిస్టులకు ఉందన్నారు. 1920-1925 మధ్య కమ్యూనిస్టులు చేసిన పోరాటాలకు బ్రిటిష్ ప్రభుత్వం భయపడి వారిపై ఎన్నో కేసులు పెట్టిందని గుర్తుచేశారు. ఆనాటి పోరాటాల్లో కమ్యూనిస్టులు ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారనీ, కమ్యూనిస్టు నాయకుల్ని హత్యచేసినా, ఆ పోరాటాలు ఆగలేదని ఆయన అన్నారు. ఆనాడు బ్రిటిషర్లు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారో, ఇప్పుడు త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్టీ అధికార కూటమి కూడా అలాంటి దారుణాలకు పాల్పడుతోందని కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు వేసి కమ్యూనిస్టు కార్యకర్తలను బెదిరిస్తున్నారనీ, బీజేపీ పాలన కారణంగా రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందనీ అన్నారు.