Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత ఛాందసవాదులకు అవకాశమివ్వొద్దు
- సెప్టెంబర్ 2 సమ్మెకు పూర్తి మద్దతు
- ప్రజలపై భారాలకు వ్యతిరేకంగా స్థానిక పోరాటాలు
- బిహార్లో 'ఐక్య స్వతంత్ర వామపక్ష కూటమి'గా పోటీ
- డిసెంబర్లో పార్టీ ప్లీనం
- సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవ తెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్ఎస్ఎ స్థాయి చర్చలు రద్దుకావడం దురదృష్టకరమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను నివారించాలంటే భారత్ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఆయన తెలిపారు. భారత్, పాక్ మధ్య యుద్దోన్మాదం పెరగడం ఇరువైపుల మత ఛాందసవాద శక్తులు బలోపేతానికి దారితీస్తుందని, ఇది రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతమని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ఇక బిహార్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలన్నీ కలిసి 'ఐక్య స్వతంత్ర వామపక్ష కూటమి'గా పోటీ చేయాలన్న దానికి కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏచూరి సోమవారం మీడియాకు వివరించారు. 'వేర్పాటు వాదులతో పాకిస్తాన్ దౌత్యవేత్తలు చర్చలు జరిపారనే కారణం తో భారత్ ఎన్ఎస్ఎ స్థాయి చర్చలను రద్దు చేసింది. ఇదే కారణంతో గతంలో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలనూ రద్దు చేసింది. కానీ పాకిస్తాన్ నేతలు వేర్పాటువాదులతో చర్చ లు జరపడం ఇది కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు. ఒకవేళ ఇదే కారణంతో చర్చలను ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటే రష్యాలో ఎన్ఎస్ఎ స్థాయి చర్చలకు బీజం పడిన 'ఉఫా' సమావేశంలోనే ఈ మేరకు షరతు విధించాల్సింది' అని ఆయన అన్నారు. పాకిస్తాన్తో చర్చలకు ప్రభుత్వం తగిన కసరత్తు జరపలేదని ఏచూరి విమర్శించారు.
నిత్యావసర ధరల నియంత్రణకు స్థానిక పోరాటాలు: బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తున్న నయా సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రజల బతుకుదెరువు మరింత దుర్భరమవుతోందని ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'రెండు దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న నయా సరళీకరణ ఆర్థిక విధానాలు కార్మికరం గంపై, వ్యవసాయం రంగంపై, మధ్య తరగతి ప్రజానీకంపై ఏ మేరకు ప్రభావం పడ్డాయనే దానిపై కేంద్రకమిటీలో అధ్య యనం చేశాం' అని తెలిపారు.
అంతర్జాతీయ పరిస్థితులు దేశ ఆర్థిక రంగంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా నిరుపేదలపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని, నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయని ఆయన వివరిం చారు. ప్రజల పై పడుతున్న భారాలను నియంత్రించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఏచూరి విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమమూ చేపట్టలేదని విమర్శించారు. ప్రజలపై భారాలను నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోరాటాలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని ఏచూరి వెల్లడించారు
సెప్టెంబర్ 2 సమ్మెకు పూర్తి మద్దతు : మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్నట్లు ఏచూరి తెలిపారు. ఇప్పటికే వామపక్ష పార్టీలన్నీ ఈ సమ్మెకు తమ మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుప్రవేశపెట్టిన 12 డిమాండ్లలో 7 ఆమోదించినట్లు దత్తాత్రేయ ప్రకటించడాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.... దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదని,తమకూ తెలియజేయలేదని ఆయన అన్నారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం : సమాఖ్య విధానానికి ఎగనామం పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, నిబంధనలకు అనుగుణంగా రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని ఏచూరి విమర్శించారు. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశానికి ఆహ్వానించారని, దీనికి సిపిఎం ముఖ్యమంత్రి మాణిక్సర్కార్ హాజరవుతారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సిపిఎం వైఖరని ఆయన తెలియజేస్తారని చెప్పారు. ఈ అంశంలో మొదటి నుంచి సిపిఎం పోరాటం చేసిందని, గతంలో బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితుల సమస్యలపై పార్లమెంట్ : దళితుల స్థితిగతులపై, వారి సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కేంద్ర కమిటీ మరోసారి పునరుద్ఘాటించినట్లు ఏచూరి వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే 21వ మహాసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆ పార్లమెంట్ సమావేశాల్లో దళితులకు సంబంధించిన బిల్లులను చర్చకు పెట్టి ఆమోదింపజేయాలని అన్నారు. జిఎస్టి బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదించాల్సిందేనని ఏచూరి స్పష్టం చేశారు.
మత ప్రాతిపదికన విభజన: మోడీ ప్రభుత్వం 'హిందూ ఉగ్రవాద' కేసుల విచారణలో జాప్యం చేయిస్తోందని, విచారణ పూర్తయిన కేసుల్లో తీర్పులు వెలువరించనీయకుండా కట్టడి చేస్తోందని ఏచూరి విమర్శించారు. తత్పలితంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్లో మత ప్రాతిపదికన ప్రజలను విభజించే చర్యలు ఊపందుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశంలో లౌకిక సామరస్యాన్ని కాపాడటం తక్షణ కర్తవ్యమని ఏచూరి వెల్లడించారు.
'ఐక్య స్వతంత్ర వామపక్ష కూటమి'గా పోటీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, సిపిఎం(ఎంఎల్) లిబరేషన్, ఆరెస్పీ, ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్, ఎస్యుసిఐ ఇతర బిహార్ వామపక్ష పార్టీలన్నీ కలిసి 'ఐక్య స్వతంత్ర వామపక్ష కూటమి'గా పోటీ చేస్తున్నామని ఏచూరి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని, ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 'మతతత్వ బిజెపిని ఓడించండి, కులతత్వ శక్తులను వ్యతిరేకించండి, బిహార్ శాసనసభలో వామపక్షల ప్రాతినిథ్యం పెంచండి' అనే మూడు నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన వెల్లడించారు.
డిసెంబర్ 27-30 వరకు ప్లీనం: సిపిఎం సంస్థాగత నిర్మాణంపై 21వ మహాసభలో నిర్ణయించినట్లుగా డిసెంబర్ 27 నుంచి 30 వరకు కొల్కతాలో పార్టీ ప్లీనం నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించినట్లు ఏచూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు నవంబర్ 2 నుంచి 5 వరకు మరోసారి కేంద్ర కమిటీ సమావేశమవుతున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే ప్లీనంకు సంబంధించి కేంద్ర కమిటీ నివేదికలను రాష్ట్ర కమిటీలలో చర్చకు పంపుతామని తెలిపారు.