Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితమివ్వని రాజన్, జైట్లీ వ్యాఖ్యలు
- ఏడు లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు కప్పకూలాయి. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు, చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతోందంటూ వెలువడిన పలు ఊహాగానాలకు తోడు, ప్రంపంచ కమోడిటీస్ మార్కెట్లలో వేగమైన పతనం, గ్రీసు పరిణామాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి. ప్రపంచ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా పయనిస్తూ మదుపరులతో కన్నీరు పెట్టించాయి. రూపాయి మరింత బలహీన పడటం, విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ మార్కెట్లను వీడి వెలుతున్నారన్న గణాంకాలు ఇక్కడి మదుపరుల సెంటిమెంట్ను మరింతగా కుంగదీశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో సోమవారం మరో 'బ్లాక్ మండే'గా నమోదైంది. బీఎస్ఈ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1624.51 పాయింట్లు క్షీణించి 25,741.56 వద్ద స్థిరపడింది. ఇదే క్రమంలో 'జాతీయ స్టాక్ ఎక్సేంజీ' సూచీ నిఫ్టీ కూడా 491 పాయింట్ల మేర పతనమై 7,809కు పడిపోయింది. 2014 అక్టోబర్లో మార్కెట్లు ఈ స్థాయిలో నమోదయ్యాయి. మదుపరులలో విశ్వాసం నింపేందుకు పతనాన్ని కొంత మేర అడ్డుకునేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ రంగరాజన్లు పలు ఊరటగొలిపే వ్యాఖ్యలతో ప్రయత్నాలు చేశారు. ఈ పతనం తాత్కాలికమైందని, చైనా పరిణామాలు, ప్రపంచ మార్కెట్లలో సంక్షోభం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని, దేశీయ మార్కెట్లు బలంగా ఉన్నాయని మార్కెట్లు త్వరలోనే తిరిగి పుంజుకోగలవని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరచలేకపోయాయి. కేవలం ఒక్కరోజులోనే దేశంలో మదుపరుల సంపద దాదాపుగా ఏడు లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఏం జరుగుతోందో తెలుసుకొనేందుకు కూడా వీలు లేకుండా మార్కెట్ సెషన్ ప్రారంభం నుంచే పతనం కొనసాగుతూ వచ్చింది. మదుపరులు వాస్తవ విషయం తెలుసుకొని ఆయా స్టాక్లను విక్రయించి వైదొలుగుదామనుకున్నా.. చాలా స్టాక్స్ను తక్కువ ధరల వద్ద వాటిని కొనే వారే కరువయ్యారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బీఎస్ఈలో దాదాపు అయిదు వందలకు పైగా స్టాక్లు లోయర్ సర్క్యూట్కు తాకాయి. కాగా 2008 సెప్టెంబర్లోనూ ఇంత భారీగా మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలో అత్యధిక విలువ కోల్పోయిన ట్రేడింగ్ సెషన్లలో సోమవారం ట్రేడింగ్ది మూడో స్థానం. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువవడంతో బీఎస్ఈలో దాదాపు 2,460 స్టాక్స్ నష్టాల్లోనే కదలాడాయి. కేవలం 277 స్టాక్స్ మాత్రమే స్వల్ప లాభాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు శుక్రవారం మదుపర్లు భారీగా రూ.2,341 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ఇదిలా ఉండగా, స్టాక్ మార్కెట్లలో బలహీనత కొంత కాలం పాటు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడలేదు - ఏచూరి
నరేంద్ర మోడీ సర్కారు ఏర్పడ్డాక మన దేశ ఆర్ధిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడలేదన్న విషయం సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిన తీరుతో స్పష్టమైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఒడిదుడుకులకు గురికావడం సహజమేనని అయితే మన దేశంపై ఇంత భారీగా ప్రతికూల ప్రభావం చూపిందంటే మన ఆర్ధిక వ్యవస్థ బలంగాలేకపోవడమే కారణమని అన్నారు.