Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్న అమిత్ షా
- అభివృద్ధి, ఆర్థిక అంశాలపై చర్చకు సిద్ధపడని బీజేపీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
హర్యానాలో మళ్ళీ పాగా వేసేందుకు అధికార బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే క్రీడాకారులను తమ పార్టీలో చేర్చుకొని వారికి టిక్కెట్లు కట్టబెట్టింది. ఎన్నికల ప్రక్రియను నేరుగా అమిత్ షానే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర నేతలు కేవలం ఆ సూచనలు పాటించడం తప్ప, వారి అభిప్రాయాలకు తావు లేదని హర్యానా నేతలు చెబుతున్నారు. హర్యానా రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అంశాలు కాకుండా ఆర్టికల్ 370 రద్దు, జాతీయవాదం, దేశభక్తి వంటి అంశాలను మాత్రమే చర్చకు పెట్టడం గమనార్హం. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశాలకే పరిమితమవుతున్నారు.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. 2014 ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు కైవసం చేసుకొని అధికారాన్ని చేపట్టింది. 17 స్థానాలతో ఐఎన్ఎల్డీ రెండో స్థానంలో నిలిచింది, 15 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాలకు పదింటిని కైవసం చేసుకుంది. పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్ర ఆవిర్భావం నుంచి అక్కడ కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ పార్టీలకు ఎదురులేదు. చిన్న చితకా పార్టీలను విలీనం చేసుకొని, బీజేపీ విస్తరించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మోడీ అధికారంలోకి రావడంతో బీజేపీకి తిరుగులేకుండా పోయింది. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన సీట్లను కాపాడుకునేందుకే కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ పార్టీలు అవస్థలు పడుతున్నాయి. దాంతోపాటు, ఆయా పార్టీల్లో ఏర్పడిన చీలికలు కూడా బీజేపీకి మరింత బలం అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతలా ఏర్పాటు చేసిన ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకొచ్చిన ఆయన మనవడు దుష్యంత్ సింగ్ గత ఎన్నికలకు ముందే కొత్తగా జననాయక్ జనతా పార్టీ స్థాపించారు. ఈ పార్టీ తరపున గడిచిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో మంచి ఓటు బ్యాంకును సాధించింది. 15 సీట్ల వరకు గట్టి పోటీనిచ్చారు.
అభివృద్ధిని మరిచి... ఆర్టికల్ 370 ఎత్తివేతే కీలకం
హర్యానా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర అంశం కాకుండా జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 ఎత్తివేతను ప్రధాన అస్త్రంగా బీజేపీ చేసింది. హర్యానాలో ఎక్కువగా హిందువులు ఉండడం వల్ల 370 ఎత్తివేత ఉపయోగపడుతుందన్న్నది షా ఎత్తుగత. ఆ విషయాన్నే హర్యానా రాష్ట్ర నేతలకు వివరించినట్టు సమాచారం. అందుకే రాష్ట్రంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు వంటివి చర్చకు రాకుండా జాతీయవాదం, హిందూత్వం, దేశభక్తి, ఆర్టికల్ 370 రద్దు వంటి భావోద్వేగాలతో కూడిన అంశాలను మాత్రమే బీజేపీ చర్చకు పెట్టింది. దాంతోనే హర్యానా విధానసభ ఎన్నికల్లో గట్టెక్కాలని ఆ పార్టీ యోచననలు పక్కా చేసుకుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.