Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో తెలంగాణ భవన్ ముట్టడించిన ఏఐటీయూసీ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తెలంగాణ సర్కారు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బంద్ను పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో అమర్జీత్కౌర్తో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరికి వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించి, 48 వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కౌర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అన్నారు. ప్రయివేటీకరణలో మోడీతో కేసీఆర్ ఉంటానంటే పెద్దఎత్తున ప్రజా పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులు సమ్మె చేస్తుంటే, కేసీఆర్ మాత్రం దాన్ని ప్రయివేటుపరం చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యారనేది మరిచిపోయి, తనను నిజాం వచ్చి ముఖ్యమంత్రి చేసినట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.