Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లల్లో పండుగ లేనట్టేనా..?
- పెండింగ్ వేతనాలతో కొందరు.. కొలువులే ఫణంగా మరికొందరు
- ఆందోళనల్లో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, హెచ్ఏఎల్, ఎయిరిండియా, టీఎస్ఆర్టీసీ కార్మికులు
న్యూఢిల్లీ : దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. రంగులేసి కొత్తగా ముస్తాబు చేసిన ఇండ్లతో ఊరు ఊరంతా ఆ రోజు అలంకరించినట్టుగా ఉంటుంది. కుటుంబమంతా కలుసుకోవడంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. దీపాలతో ఇల్లే కాదు.. ముఖాలు వెలిగిపోతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు బోనస్లతో మరింత సంబురపడుతారు. కానీ, ఈ ఏడాది దీపావళి పండుగ రోజున చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లల్లో ఆ వెలుగులు కనిపించేలా లేవు. వేతనాలు పెండింగ్లో ఉండో.. వేతన సవరణల కోసమో.. కొలువుల భద్రత కోసమో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో పండుగ కోలాహలానికి దూరమవుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు బంద్కు పిలుపునిస్తున్న కార్మిక సంఘాలు.. అనివార్యంగానే పండుగ రోజును బారుకట్ చేసే దుస్థితిని ఎదుర్కొనేలా ఉన్నారు శ్రామికులు.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కార్మికుల జీతాలు పెండింగ్
ఈ ఏడాది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) కార్మికులు జీతాలందక నానాతిప్పలు పడుతున్నారు. బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న 1,80,000 మంది ఉద్యోగులకు జీతాలివ్వడం సంస్థకు మార్చి నుంచి కష్టతరంగా మారింది. పెండింగ్లో ఉన్న గతనెల జీతాలివ్వాలని ఈ నెల 10న బీఎస్ఎన్ఎల్ కార్మికులు స్ట్రైక్ చేశారు. ఇప్పుడు దాన్ని మరింత ఉధృతం చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి రుణాలు, పిల్లల కాలేజీ ఫీజులు, ఇంకా ఎన్నో ఖర్చులను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని చెబుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రాజేశ్ శర్మ ఆవేదన చెందాడు. 'ఎప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. మేం పనిచేస్తున్నాం. కానీ, జీతాలెప్పుడు వస్తాయో తెలియదు. మాకు బోనస్లూ వద్దు. మా వేతనాలు ఇస్తే అదే చాలు' అని వాపోయారు. ఢిల్లీ, ముంబయిలో కార్యకలాపాలున్న ఎంటీఎన్ఎల్ ఉద్యోగులూ రెండు నెలలుగా జీతాలు అందుకోలేదు. ఈ నెలలో వారు పలుమార్లు లంచ్ అవర్లో నిరసనలు తెలిపారు.
హెచ్ఏఎల్లో నిలిచిన వేతనాల ఇంక్రిమెంట్
హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తన 79 ఏండ్ల చరిత్రలో కార్మికుల భారీ ఆందోళనను ఎదుర్కొంటున్నది. వేతనాల సవరణ కోసం డిమాండ్ చేస్తూ.. దాదాపు 20 వేల మంది ఉద్యోగులు బెంగళూరు, హైదరాబాద్, కోరాపుట్, కోర్వా, కాన్పూర్, లక్నో, నాసిక్లోని డిఫెన్స్ యూనిట్లలో ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చినట్టే 15శాతం ఫిట్మెంట్(మూలవేతనంలో పెంపు), 35శాతం ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 11శాతం ఫిట్మెంట్, 22శాతం ఫిట్మెంట్లను అందించి వివక్ష చూపారని వర్కర్లు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగానున్న తొమ్మిది యూనిట్ల కార్మికులు పాల్గొంటున్నారని ఆలిండియా హెచ్ఏఎల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ నేత చంద్రశేఖర్ తెలిపారు.
ఎయిరిండియాలోనూ వేతనాల తిప్పలు
ప్రభుత్వరంగ వైమానిక సంస్థ ఎయిరిండియాను ప్రయివేటుపరం చేసే ప్రమాదమున్నదని అనేక యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైలట్లు, ఇంజనీర్లు, ఆఫీసర్ల ప్రతినిధులు ఈ నెల 14న జరిగిన ఓ సమావేశంలో సర్కారు పెట్టుబడుల ఉపసంహరణపై అసంతృప్తిని ప్రకటించారు. ప్రయివేటీకరణ తర్వాత వేతనాలు, ప్రోత్సాహకాలు అందుతాయన్న నమ్మకం లేదని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెప్టెన్ టి ప్రవీణ్ కీర్తి అన్నారు. కాగా, ఈ నెల తర్వాత వర్కర్లకు జీతాలు చెల్లించేందుకు ఎయిరిండియా దగ్గర నిధుల్లేవని వచ్చిన కొన్ని రిపోర్టులు ఉద్యోగుల్లో మరింత కలవరాన్ని సృష్టిస్తున్నాయి.
టీఎస్ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదానితోపాటు 25 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆరేండ్లుగా డైరెక్ట్ నియామకాల్లేవనీ, కొన్నేండ్లుగా సంస్థకు సర్కారు రీయింబర్స్మెంట్లు చెల్లించట్లేదని జేఏసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ధర్నాకు దిగిని దాదాపు 49వేల మంది కార్మికులు గత నెల జీతాన్ని అందుకోలేదు. అయితే, అక్టోబర్ 21 వరకు చెల్లింపులన్నీ జరపాలని కార్పొరేషన్కు హైకోర్టు ఆదేశించింది. కార్మికులపై రాష్ట్ర సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనీ వర్కర్లు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. విధుల్లో చేరని 49వేల మంది వర్కర్లను ఉద్యోగాల్లో చేరబోనివ్వమనీ, డిమాండ్లపై చర్చలూ జరపబోమని సీఎం ఏకపక్షధోరణి వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు.
బ్యాంకర్ల ఆందోళన
10 బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రెండు ప్రధాన ట్రేడ్ యూనియన్లు వచ్చేవారం ఆందోళన చేసేందుకు ప్రతిపాదనలు చేశాయి. ఈ నెల 22న దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమయ్యాయి. విలీనం అనేది ప్రయివేటీకరణకు మొదటి అడుగ్గా చెప్పుకోవచ్చనీ, ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో వివరించింది. కొలువులు కోల్పోతామన్న భయంతో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు.