Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో ఖట్టర్ సర్కారుపై నిర్మాణరంగ కార్మికుల ఆగ్రహం
- మందగమనంతో మరిన్ని ఇబ్బందులు
- సంక్షేమ పథకాలు కాగితాలపైనే..
చండీగఢ్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. గడిచిన కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న మందగమనం కారణంగా.. ఈ రంగం బాగా ప్రభావితమైన విషయం తెలిసిందే. కొత్త భవనాల నిర్మాణాలు లేక కార్మికులంతా లేబర్ అడ్డాలు, కూడళ్ల వద్ద పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో వీరికి పూట గడవడమే కష్టంగా మారింది. దీనిని నివారించి కార్మికులను ఆదుకోవాల్సిన బీజేపీ సర్కారు.. జాతీయవాద అంశాన్ని రెచ్చగొడుతున్నది. తమకు తినడానికే తిండికి లేకుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మాత్రం కాశ్మీర్లో ఇండ్లు కొనుక్కోవాలని సలహా ఇస్తుండటంపై కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ, ప్రధాన పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ నిర్మాణ రంగ కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో 7.76 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో రిజిష్టర్డ్ కార్మికులుగా ఉండగా.. వీరిలో 60వేల మంది జింద్ జిల్లా నుంచి ఉన్నారు. ఈ రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2007లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. దీనికింద కార్మికులకు ఆర్థిక సాయం, వారి పిల్లలకు స్కాలర్షిప్లు, పెండ్లిళ్లకు సాయం వంటివి ఉన్నాయి. కానీ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఐదేండ్ల పాలనలో కార్మికులకు ఆర్థికసాయం అందించడం లేదని జిల్లాలోని ఫతేగఢ్కు చెందిన రాజేశ్ అన్నాడు. తన కూతురు పెండ్లి చేసి మూడేండ్లు గడుస్తున్నా.. దానికి సంబంధించిన ఆర్థికసాయాన్ని సర్కారు ఇంకా అందజేయలేదని ఆయన చెప్పాడు. మరో కార్మికుడు ప్యారేలాల్ మాట్లాడుతూ.. తన కూతురు చదువుకు రావాల్సిన ఉపకారవేతనం ఇంకా అందలేదని అన్నాడు. తన కూతురు పెండ్లి కోసం అప్పు తీసుకొచ్చాననీ, కానీ ఆర్థికసాయం అందించాల్సిన సర్కారు ఇంకా ఇవ్వడం లేదని తెలిపాడు. దీంతో తీసుకున్న రుణం రెండింతలయ్యిందని వివరించాడు. 'మా పైసలు మాకివ్వడానికీ బీజేపీ సర్కారు ఇష్టపడటం లేదు. అది మా హక్కు. ప్రభుత్వం వేసే బిక్ష కాదు' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదిలాఉంటే కార్మికులు ఆన్లైన్లో వారిపేరు నమోదు చేసుకోవాలనీ, వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రకటించింది. అయితే దీనికోసం తయారుచేసిన వెబ్సైట్ తప్పులతడకగా ఉన్నదనీ, అది సక్రమంగా పనిచేయడం లేదని కార్మి కులు ఆరోపిస్తున్నారు. దీంతో దీనిని నిరసిస్తూ ఈ ఏడాది జూన్లో కార్మికులు రాష్ట్ర సచివాలయం ఎదు టధర్నాకు దిగారు. ఆన్లైన్ ప్రక్రియతో పాటు తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.