Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే 15 శాతం ఎక్కువ: యూఎస్డీఏ
న్యూఢిల్లీ : గతేడాదితో పోలిస్తే దేశంలో ఈ ఏడాది పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉన్నదని యూఎస్కు చెందిన యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) అంచనా వేసింది. 2019-20లో భారత్లో 390 లక్షల ఇండియా బేళ్ల (ఒక్క బేలు 170 కిలోలు) పత్తి ఉత్పత్తి అవుతుందని అది తెలిపింది. గతేడాది 312 లక్షల బేళ్ల పత్తి దిగుబడి అయ్యింది. ఇక ప్రస్తుత ఏడాదిలో 15 శాతం ఉత్పత్తి పెరగనున్నది. ఈ సీజన్లో తొలుత వర్షాలు సరిగ్గా కురవకపోయినా ఆగస్టు నుంచి ఊపందుకోవడంతో 2019-20లో దేశవ్యాప్తంగా రైతులు 127.67 లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేస్తున్నారు. ఇది గతేడాది కంటే 6 లక్షల హెక్టార్లు అధికం. అంతేగాక తాజాగా కురిసిన వర్షాలతో పత్తి దిగుబడి పెరిగే అవకాశమున్నదనీ, ఇది గడిచిన మూడేండ్లలో గరిష్ట ఉత్పత్తిగా నమోదు కానున్నదని యూఎస్డీఏ అంచనా వేసింది. ఇదిలాఉంటే ఇండియన్ కాటన్ ట్రేడర్స్ దీనిపై ఎటువంటి అంచనాలు విడుదల చేయకున్నా.. 322.7 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కానుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇక గతంతో పోలిస్తే భారత్లోనూ పత్తి వినియోగం 3 శాతం పెరిగిందని యూఎస్డీఏ తెలిపింది.