Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్ కుమార్
అమరావతి: కడప, కర్నూలు జిల్లాల్లోని నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణ మాత్రమే జరిగిందని ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్.ప్రతీప్కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అటవీ శాఖ కేంద్రాలు, పర్యాట కేంద్రాల తనిఖీల్లో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో రిజర్వ్ ఫారెస్టుకు బయట రెవెన్యూ భూముల్లో యురేనియం అన్వేషణ జరిగిందని తెలిపారు. దీనికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడ్డు చెప్పడంతో అన్వేషణ నిలిచిపో యిందని చెప్పారు. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అన్వేషణ 2016లో భారత ప్రభుత్వం నిబంధనల మేరకు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా నల్లమల అడవుల్లో 20 బోరు హోల్స్ మాత్రమే వేసేందుకు అనుమతి ఇచ్చా మన్నారు. అయితే, 300 బోరు హోల్స్ వేయడానికి అనుమతులు కావాలని అడిగారని తెలిపారు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో హైదరాబాద్కు చెందిన ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ నల్లమల అడవుల్లో సర్వే చేసిందన్నారు. 70 బోరు హోల్స్ వేస్తే సరిపోతుందని నిర్ధారించిందని తెలిపారు. ఇటీవల మారిన భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన అధికారమూ లేదన్నారు. అంతా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన జాతీయ సర్వేలు, డిజిఆర్ సర్వేలు, జిఎస్ఎల్ సర్వేలను కేంద్ర ప్రభుత్వం చేసిందని తెలిపారు.
అటవీ శాఖ ఉత్పత్తులు ఇక ఆన్లైన్లోనే...
అటవీ శాఖ ఉత్పత్తులు, అమ్మకాలన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని ప్రతీప్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 ఉద్యోగాలను వచ్చే జనవరి నెలాఖరులోగా భర్తీ చేస్తామని తెలిపారు. అటవీ శాఖకు ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న నిర్ణయం తీసుకుందని, ఇందుకు రూ.40 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అటవీ శాఖకు ప్రత్యేక భవనం నిర్మాణం కాలేదన్నారు. త్వరలో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో అధునాతనమైన గ్రీన్ బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. అడవుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా ఎర్ర చందనం, రంగురాళ్ల తవ్వకాలు, నార్త్ కోస్టల్లో టేకు చెట్ల అడవుల రక్షణకు, ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన కోరంగి అభయారణ్యంలో బోటు షికారు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీటీఎఫ్ రాజమహేంద్రవరం విభాగం అధికారి శాంతిప్రియ పాండే, విశాఖ సిసిఎఫ్ రాహుల్ పాండే, డీఎఫ్ఓలు నందని తలారియా, అనంత శంకర్, కృష్ణా, పశ్చిమగోదావరి డీఎఫ్ఓలు, కోరంగి ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.