Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతజయంతి ఉత్సవాల్లో వక్తలు
విశాఖ : నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు కామ్రేడ్ పివి.రమణ అని వివిధ పార్టీల నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కామ్రేడ్ పివి.రమణ శతజయంతి ఉత్సవాలు విశాఖ జిల్లా మునగపాక మండల కేంద్రంలోని మునగపాక నందీశ్వర కళాప్రాంగణంలో ఆదివారం ఘనం నిర్వహించారు. ముందుగా పివి.రమణ చిత్రపటానికి మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, బండారు సత్యనారాయణమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, జనసేన నాయకులు సుందరపు విజరుకుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ రాజకీయాల్లో పివి.రమణతో తనకు ఎంతో పరిచయం ఉందన్నారు. ఆయనతో గడిపిన సన్నివేశాలను నేటికీ మర్చిపోలేనని తెలిపారు. రాజకీయాల్లో పివి.రమణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చరిత్రను పార్టీ పుస్తకాల్లో నిలిపి నాయకులకు, యువతకు రమణ ఆదర్శాలు తెలియజేయాలని సూచించారు. పి.వి.రమణ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతి చోట ఏర్పాటు చేయాలన్నారు. వీరభద్రరావు మాట్లాడుతూ అక్రమాలపైనా, అన్యాయాలపైనా పివి.రమణ అనేక ఉద్యమాలు చేశారన్నారు. ప్రజలకు న్యాయం చేయాలని ప్రతి నిమిషం పరితపించేవారని కొనియాడారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో పుచ్చలపల్లి సుందరయ్య తరువాత అంతటి మహోన్నత వ్యక్తి పివి.రమణ అని పేర్కొన్నారు. పార్టీ కోసం ఆస్తులను కూడా దానం చేశారన్నారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ రాజకీయ ఉద్యమాలకు పుట్టినిళ్లు మునగపాక అని, దానికి కారణం పివి.రమణ అని చెప్పక తప్పదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో 56 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అందులో పివి రమణ ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. పివి.రమణను ఆదర్శంగా తీసుకోవాల న్నారు. అనకాపల్లి ఎంపీ బివి.సత్యవతి, సీపీఐ(ఎం) అనకా పల్లి నియోజకవర్గ కన్వీనర్ ఎ.బాలకృష్ణ, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు పెంటకోట రామారావు, ఆళ్ల మహేశ్వరరావు, పివి.రమణ కుటుంబ సభ్యులు, పివి.రమణ శిష్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు.