Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇంటర్నెట్, సామాజిక మాధ్యమం సేవల విషయంలో కొత్త నిబంధనావళిని తీసుకువస్తామనీ, ఇందుకోసం మరో మూడు నెలల గడువు కావాలని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమం వేదికలపై విద్వేషం, తప్పుడు వార్తల ప్రచారం, అప్రతిష్టపాల్జేసే సందేశాలు, జాతి వ్యతిరేక కార్యకలాపాలు...అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని ఇంతకు ముందు విచారణలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్ని అడ్డుకోవటంపై మార్గదర్శకాలు రూపొందించాలని మూడు వారాల గడువు ఇచ్చింది.
జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈకేసును విచారిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 24 విచారణ సందర్భంగా ధర్మాసనం, ఇంటర్నెట్ వాడకం తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలు, సందేశాలు మూకదాడులు, హత్యలకు కారణమవుతున్నాయనీ ధర్మాసనం ప్రస్తావించింది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమం సేవలు అందజేస్తున్న సంస్థలకు నూతన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈనేపథ్యంలో సోమవారం నాటి విచారణలో కేంద్రం అఫిడవిట్ దాఖలుచేసింది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమం విస్తరించిన తీరు ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడింది. వీటికి సంబంధించి కొత్త నిబంధనలు, నియంత్రణ చర్యలు రూపొందిస్తున్నామనీ, వచ్చే ఏడాది జనవరి 20నాటికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని కోర్టుకు కేంద్రం తెలిపింది. వాట్సాప్, ఫేస్బుక్లకు వ్యతిరేకంగా మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులన్నీ అత్యున్నత న్యాయస్థానంకు బదిలీ చేసి విచారించాలని వాట్సాప్, ఫేస్బుక్లు సుప్రీంలో పిటిషన్లు వేశాయి.