Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో జోన్లకు 25శాతం మంది బదిలీ
న్యూఢిల్లీ : రైల్వే బోర్డులో 25శాతం మంది అధికారులను తగ్గించాలని భారత రైల్వే నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే బోర్డులో 200 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వీరిలో 50 మంది అధికారులను(25శాతం మంది) జోన్లకు బదిలీ చేయనున్నట్టు సమాచారం. తద్వారా బోర్డు సిబ్బందిని 150 మందికి తగ్గించనున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జోన్లకు అధికారుల బదిలీ నిర్ణయం దీర్ఘకాలం నుంచి వినిపిస్తున్నది. ఈ ప్రతిపాదన తొలుత 2000లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే వచ్చింది. కాగా, బోర్డు అధికారుల బదిలీల ప్రక్రియ ఒక నెలలోనే ముగుస్తుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది బోర్డులోని ఉన్నతస్థాయి సభ్యులపై ఎలాంటి ప్రభావమూ చూపబోదని వివరించారు. బోర్డులో చాలా మంది ఒకేరకమైన విధులు నిర్వర్తిస్తున్నారనీ, అయితే జోన్లలో సామర్థ్యాన్ని పెంచేందుకే సీనియర్ అధికారుల బదిలీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంత మంది అధికారులను బదిలీ చేయాలన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి చెప్పారు.