Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపాల్
ప్రభుత్వరంగ బ్యాంకులలో ప్రయివేటీకరణ చర్యలు ఆపాలని, బ్యాంకుల విలీనం చేపట్టరాదని నేడు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలలో ప్రధానమైన ఏఐబీఈఏ, బీఈఎఫ్ఐలు నాయకత్వం వహిస్తున్నాయి. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల పరిరక్షణే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. ఈ సమ్మెను బలపరచడం మనందరి బాధ్యత. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంలో వెన్నుదన్నుగా నిలుస్తున్న మన ప్రభుత్వరంగ బ్యాంకులను బడా పెట్టుబడిదారులకు మాత్రమే సేవ చేసే విధంగా సంస్కరణలు అమలుచేస్తున్నారు.
ఇందులో భాగంగా కార్పొరేట్ శక్తులకు ఆప్తమిత్రుడైన నరేంద్రమోడీ ప్రభుత్వం మరింత దూకుడుగా బ్యాంకుల విలీనం ప్రకటించింది. 2014లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులుంటే 2019 నాటికి 18కి కుదించబడ్డాయి. ప్రస్తుతం 10 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 4 పెద్ద బ్యాంకులుగా ప్రకటించారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేస్తున్నారు. సిండికేట్ బ్యాంక్లో కెనరా బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్ బ్యాంక్, మన ఆంధ్రాబ్యాంక్ విలీనం చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంకును విలీనం చేయబోతున్నారు. ఇవి 2020 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థికశాఖామంత్రి ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఆంధ్రాబ్యాంక్ విలీనం కీలకమైనది. 96ఏండ్ల చరిత్ర, రూ.14.59 లక్షల కోట్ల వ్యాపారం, 20 వేల 346 మంది సిబ్బంది కల్గిన ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయరాదని ప్రతిఘటించినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను ఎస్బీఐ.లో విలీనం చేసి మన ఉనికి లేకుండా చేశారు. మరోపక్క మరాఠీల కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తమిళుల ఐఓబీ, బెంగాలీల యుకో బ్యాంక్, పంజాబీల కోసం పంజాబ్ Ê సింథ్ బ్యాంకులను విలీనం చేయలేదు. ఆ రాష్ట్రాలకున్న గుర్తింపు, ఆత్మగౌరవం తెలుగు రాష్ట్రాలకు అవసరం లేదా అని ఉద్యోగుల ప్రశ్న? ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులంతా హైదరాబాద్లో ఉన్న హెడ్డాఫీసును కాదని ముంబై హెడ్డాఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధపడుతున్నారు.
బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల వల్ల ప్రజలకు నాణ్యమైన సేవలు, అందరికి రుణాలు అందించే పరిస్థితి ఉంది. కానీ విలీనం జరిగిన తరువాత పెద్ద బ్యాంకులుగా ఏర్పడితే పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాత్రమే రుణాలు పొందే పరిస్థితి ఉంటుంది. మొండి బకాయిలు పెరుగుతాయి. కార్పొరేట్లు రుణమాఫీలు పెరిగి పేదలకు రుణాలిచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు కష్టమర్లపై పెనాల్టీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు పెరుగుతాయి. మినిమం బ్యాలెన్స్ లేదనే పేరిట వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ములోనుంచి బ్యాంకులు పొందినది గమనించాలి! డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగకపోవడం వల్ల మధ్యతరగతి, వేతన జీవులందరూ తీవ్రంగా నష్టపోతారని ఉద్యోగ సంఘాలు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఆనాడు 1969లో దేశాభివృద్ధి కోసం ప్రయివేటు బ్యాంకుల జాతీయకరణ జరిగితే 50ఏండ్ల తరువాత 2019లో మోడీ ప్రభుత్వం బడా బాబుల కోసం ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి పాల్పడుతున్నది. బ్యాంకుల కుంభకోణాలు, కార్పొరేట్ శక్తుల మొండి బకాయిలు, వారికి కేంద్రం చేసిన రుణమాఫీలు పరిశీలిస్తే ఎవరికోసం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. 2014 నాటికి బ్యాంకులలో బకాయిలు రూ.18 లక్షల కోట్లు ఉంటే 2014 తరువాత రూ.58 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే కార్పొరేట్ కంపెనీల మొండి బకాయిలను వసూలు చేయకుండా 'రైట్ ఆఫ్' (ఖాతాలో నుండి తొలగించడం) చేస్తున్నారు. ఒక్క 2018-19లో రూ.1.76 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు. ఈ ఐదేండ్ల కాలంలో రూ.5.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతుల రుణాలు మాఫీ చేసినా రూ.2లక్షల కోట్లు దాటవు. కానీ కార్పొరేట్ కంపెనీల యజమానులలో కేవలం 88మందికి రూ.500కోట్లకు పైగా ఎగ్గొట్టినవారికి మాఫీ చేశారు. మరో 416మందికి సగటున రూ.424కోట్లు రుణాలు ఎగ్గొట్టినవారికీ మాఫీ చేశారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పులు కట్టుకోలేక వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి చూస్తున్నాము. వారికి ఋణమాఫీ ఉండదు. బ్యాంకులలోని ప్రజల సంపదనంతా కార్పొరేట్లకే పంచి పెడుతున్నారన్నది కండ్లముందే కనబడుతున్నది. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ.11 వేల కోట్లు స్కామ్ నిందుతుడు నీరవ్ మోడీ, రూ.9 వేల కోట్ల విజరుమాల్యా స్కామ్ మరచిపోకముందే నిన్న గాక మొన్న ముంబై కేంద్రంగా పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం వెలుగుచూసింది. రూ.4,355 కోట్ల రుణం అంటే మొత్తం బ్యాంకులో 70శాతం ఒక హెచ్డీఐఎల్ రియాలిటీ సంస్థకే ఇచ్చింది. దీంతో 16లక్షలమంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు. ఖాతాదారులందరూ ముంబైలోని బీజేపీ కార్యాల యం ముందు ధర్నా చేపట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐసీఐసీఐ ఎండి. ఛందాకొచ్చార్ తన భర్త వీడియోకాల్ సీఐఓతో కలిసి రూ.3,250 కోట్ల రుణ ఎగవేత కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కామ్ల వెనకాల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయన్నది కనబడుతున్నది.
మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం ప్రభుత్వరంగ సంస్థలనే ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థలలో రూ.1.05 లక్షల కోట్లు విలువైన వాటాలు విక్రయించాలని టార్గెట్. రైల్వేలు, బొగ్గు గనులలో 100శాతం ఎఫ్డీఐ, ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మకం, బీఎస్ఎన్ఎల్ను దివాళా తీయించడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, హెచ్ఏఎల్ లాంటి డిఫెన్స్ సంస్థలను కూడా ప్రయివేట్ పెట్టుబడిదారులకు అప్పగించబోతున్నవి. దేశ ఆర్థిక వ్యవస్థ ను ప్రమాదకర స్థితికి చేర్చుతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఆవహించింది. జీడీపీ 6శాతానికి తగ్గింది. అయినా ప్రభుత్వ బ్యాంకులను విలీన బాట పట్టించి ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపించడం గమనించాలి. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె పోరాటానికి ప్రజలందరూ అండగా నిలవాలి. ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకోవాలి.
సెల్: 9490098034