Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటకొచ్చిన బోటు పైభాగం
- నేడు మళ్లీ ప్రయత్నం
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఏడో రోజు బోటు వెలికితీత కార్యక్రమం క్షణక్షణం ఉత్కంఠగా సాగింది. బోటును బయటకు తీస్తారనే ప్రచారంతో మీడియాతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. వెలికితీత పనులను ఆసక్తితో గమనించారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి అండర్ వాటర్ డ్రైవింగ్ సర్వీసు బృందం, ధర్మాడి సత్యం బృందం సోమవారం చేసిన ప్రయత్నాలు కొంతవరకే ఫలించాయి. బోటు పైకప్పు ఐరన్ గ్రిల్, గేర్ బాక్స్ మాత్రమే బయటకు రావడంతో ఉత్కంఠగా ఎదురు చూసిన వారు నిరాశకు గురయ్యారు. బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం బృందం విశాఖకు చెందిన ఓం శివశక్తి అండర్ వాటర్ డ్రైవింగ్ సర్వీసు బృందం సహకారం రెండో రోజూ తీసుకుంది. నదిలోకి దిగి బోటు చుట్టూ ఒక ఐరన్ రోప్ను ఆదివారం ఈ బృందం బిగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలోని నాగరాజు, దాసు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల మధ్య నదిలో నాలుగుసార్లు దిగారు. మరో ఐరన్ తాడును బోటు చుట్టూ బిగించింది. ఆ తర్వాత ధర్మాడి బృందం మధ్యాహ్నం 1.38 గంటలకు తాడును ప్రొక్లయినర్ సహాయంతో గట్టిగా లాగింది. అయితే, బోటు పైభాగానికి చెందిన ఐరన్ గ్రిల్స్, గేర్బాక్స్, బోటు పైభాగంలో ఐరన్ గ్రిల్కు ఉన్న ప్లెక్సీ, నేమ్ బోటు, ఒక కళ్లజోడు మాత్రమే బయటకు వచ్చాయి. బోటు మాత్రం పైకి రాలేదు. ఉదయం 7.30 గంటలకు కాకినాడ పోర్టు డైరెక్టర్ కెప్టెన్ ఆదినారాయణ కచ్చులూరు చేరుకుని బోటు వెలికితీత విషయంలో ఈ బృందాలకు పలు సూచనలు చేశారు. సోమవారం జరిగిన బోటు వెలికితీత పనుల్లో బోటు 15 మీటర్ల ముందుకు వచ్చిందని వాటర్ డ్రైవింగ్ బృందం సభ్యులు తెలిపారు. మంగళవారం మళ్లీ ప్రయత్నిస్తామని ఆ బృందానికి చెందిన నాగరాజు, దాసు చెప్పారు. బోటు వెలికితీత విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్టు కాకినాడ పోర్టు డైరెక్టర్ కెప్టెన్ ఆదినారాయణ తెలిపారు.