Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంపీకి ఇచ్చి... సీఎంకు నిరాకరణ
- ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి ఎదురుచూపులు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్రమంత్రుల నుంచి అపాయింట్మెంట్ దొరకలేదు. హస్తినలో అందుబాటులో ఉండాలని పిలిచి పొద్దు పోయేదాకా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా, అదే సమయంలో తెలంగాణకు చెంది బీజేపీ ఎంపీకి కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్న జగన్ ఉదయం నుంచి కేంద్రమంత్రుల నుంచి పిలుపు కోసం ఎదురుచూశారు. కానీ కేంద్రమంత్రులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో, ఆయన నిరీక్షణకు ఫలితం లేకపోయింది. వాస్తవానికి అపాయింట్మెంట్ ఇస్తామని కేంద్ర మంత్రులు నుంచి సీఎం జగన్మోహన్రెడ్డికి సమాచారం అందడంతో ఆయన ఢిల్లీకి వచ్చారు. తీరా ఆయన ఢిల్లీకి వచ్చాక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనకు రోజంతా ఎదురుచూపులే మిగిలాయి. సోమవారం ఉదయం 11:30 ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి(జన్పథ్-1) చేరుకున్నారు. అక్కడి నుంచే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ భేటీ అవుతారని ప్రచారం జరిగింది. కేంద్ర హోం మంత్రితో విభజన చట్టంలోని అంశాలపై చర్చిస్తారని తెలిసింది. కేంద్ర జలశక్తి మంత్రితో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంపై మాట్లాడుతారని వార్తలొచ్చాయి. రివర్స్ టెండరింగ్ వల్ల ఎంత మేరకు సొమ్ము ఆదా అయ్యిందో, రివర్స్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేంద్ర మంత్రికి వివరిస్తారని ప్రచారం జరిగింది. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చెలరేగుతున్న వివాదాలపై సీఎం జగన్ చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. అందుకనుగుణంగానే అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులెవ్వరితోనూ భేటీ కాలేదు. ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో మంత్రులంతా బిజీగా ఉన్నారు. కనుక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ముగ్గురు మంత్రుల్లో ఏ ఒక్కరి నుంచి పిలుపు రాకపోడంతో, రోజంతా ఆయన తన నివాసంలోనే నిరీక్షించారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. నార్త్బ్లాక్లోని తన కార్యాలయంలో తనను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎంపీ అరవింద్ కలిసి వివిధ సమస్యలపై 15 నిమిషాల పాటు మాట్లాడారు. అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు.
ఎన్బీసీసీతో ఏపీ సర్కారు ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీి)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాసం(జన్పథ్-1)లో ఎన్బీసీసీతో ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల కల్పనకు ఈ ఒప్పందం జరిగినట్టు సమాచారం. సీఎం జగన్, తన నివాసంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వం అధికారులు(ఐఏఎస్లు)లతో సమావేశం అయ్యారు. వారితో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. అలాగే సీిఎం జగన్తో పెట్టుబడుల, పరిశ్రమల సలహాదారు పీటర్ హసన్, ఎన్డీసీ సంయుక్త కార్యదర్శి అభరు త్రిపాఠి భేటీ అయ్యారు. సీఎం జగన్మోహన్రెడ్డిని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయులు తదితరులు కలిశారు. కాగా, ఎంపీలు ఒకరి తరువాత ఒకరి భేటీ తమ సమస్యలను వివరించారు.