Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ హోంగార్డుల నిరసన
- తొలగించింది 25 వేలు కాదు.. 41 వేల మందిని
- ఆందోళనను ఉధృతం చేస్తాం : అసోసియేషన్
లక్నో : తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ యూపీలో హౌంగార్డులు నిరసన గళం వినిపించారు. షాజహాన్పూర్ జిల్లాలో హోం గార్డులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తాము ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించటంలేదనీ, బడ్జెట్ పరిమితుల కారణంగా పని గంటలు మాత్రమే తగ్గిస్తు న్నట్టు రాష్ట్ర మంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వాస్తవం ఇందుకు భిన్నంగా వున్నది. ప్రభుత్వ ఈ ప్రకటన తర్వాత.. ఒక్క షాజహాన్పూర్లోనే 874 మంది హోం గార్డులు ఉద్యోగాలు కోల్పోయారు. 'సర్వీసుల నుంచి ఎవరినీ తొలగించటంలేదని సబంధిత మంత్రి చేతన్ చౌహాన్ ఈ నెల 16న ప్రకటించారు. మరి ఈ 874 మందిని ఎలా తొలగించారు? ప్రభుత్వం, మంత్రి వాస్తవాలను దాచిపెడుతున్నారు. హోంగార్డు కోటా కింద 25,000 మందిని, పోలీసు కోటా కింద 16,500 మందిని తొలగించారు. మొత్తం 41,519 మంది ఉద్యోగాలను కోల్పోయారు. బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని అడుక్కు తినేలా ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే కొందరు ఆ పని ప్రారంభించారు. మాకు ఇక వేరే అవకాశంలేదు' అని హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా నేత రామ్ సేవక్ ఆరోపించారు. 'మంత్రి చేతన్ చౌహాన్ను కలిసి వినతిపత్రం సమర్పించినప్పుడు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. కానీ, మరుసటి రోజే 25 వేల మందిని తొలగించారు. పండుగ ముందు ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులను చేసింది' అని హోంగార్డు అజరుకుమార్ త్యాగి వాపోయారు.
నిరసనకారులకు షోకాజ్ నోటీసులు
మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముజఫర్నగర్లో బిచ్చమెత్తుకుంటూ వినూత్న ఆందోళనలో పాల్గొన్న కొందరు హోం గార్డులకు షోకాజ్ నోటీసులు అందాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన, నినాదాలు చేయటం ద్వారా సర్కార్ను, హోంగార్డ్ శాఖను అప్రతిష్టపాలు చేశా రని ప్రదీప్కుమార్కు అందిన షోకాజ్ నోటీసులో పేర్కొనటం గమనార్హం. 'ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందుకు మేం రెండు మూడు రోజులు వేచి చూస్తాం. లేకపోతే.. దశలవారీ ఆందో ళనను కొనసాగిస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన 41,519 మందిమి రక్తదానం చేస్తాం. మా రక్తం అమ్మి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరతాం. అయినా.. ప్రభుత్వం మా గోడు వినకపోతే.. ఆందోళ నను ఉధృతం చేస్తాం. ఆత్మహత్య లకు కూడా వెనుకా డబోం' అని హోం గార్డుల అసోసియేషన్ అధ్యక్షులు రమేంద్ర యాదవ్ తెలిపారు. 'తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు చెప్పినట్టు సమా నపనికి.. సమానవేతనం ఇవ్వాలి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఇక్కడ శాంతి భద్రతలను కాపా డటంలో పోలీసులతో సమానంగా మేం విధులను నిర్వహిస్తున్నాం. కానీ, మా పనికి తగ్గట్టు వేతనం లేదు. మాకు అన్యాయం జరుగుతున్నది. మేం మను షులం కాదా?' అని యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఆగస్టు 28న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో 25 వేల మంది హోంగార్డులను తొలగించాలని నిర్ణయించారు.