Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఆదాయాన్ని కిసాన్ పథకం, గ్రామీణ ఉపాధి పథకాలకు మళ్లించడం మేలు
- ఆర్థికశాస్త్రంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని అభిజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ మేరకు ఆయన 'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ సర్కార్కు అభిజిత్ సూచించారు. పన్ను ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రధానమంత్రి కిసాన్ పథకంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. వినయోగించేవారి చేతుల్లోకి డబ్బులు చేరాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి-2019కి అభిజిత్బెనర్జీ, ఆయన భార్య ఈస్తర్డఫ్లోతోపాటు మరో ఆర్థికవేత్త మైఖేల్క్రెమర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
కార్పొరేట్ల చేతుల్లో ఇప్పటికే కావలసినంత డబ్బు ఉన్నదని, పెట్టుబడులు పెట్టకపోవడానికి కారణం డిమాండ్ లేకపోవడమని అభిజిత్ వివరించారు. అంతేతప్ప కార్పొరేట్ కంపెనీల వద్ద డబ్బులు లేకపోవడం వల్ల కాదని ఆయన అన్నారు. తన భార్య డా||డఫ్లోతో కలిసి రాసిన 'గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్'కు సంబంధించిన అనుబంధ ప్రశ్నలో భారత ఆర్థిక వ్యవస్థ కఠిన కాలంలో ప్రయాణిస్తున్నదా అని అడగ్గా... 'నా దగ్గర ఖచ్చితమైన డేటా లేదు. జీడీపీ డేటాను చూస్తే ఇప్పటికీ బాగానే ఉన్నది. ఇతర డేటా చూస్తే బాగా లేదు. ఎన్ఎస్ఎస్ డేటా చూస్తే 2014-15 తర్వాత అభివృద్ధి ఆగిపోయింది. సగటు వినిమయం చూసినా అదే విధంగా కనిపిస్తోంది. భారత్ కఠిన కాలంలో పయణిస్తున్నట్టుగా భావిస్తున్నాను' అని అభిజిత్ తెలిపారు.
ర్యాండమ్ సర్వేల ద్వారా ఒక దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా అంచనా వేయగలరంటూ వచ్చిన విమర్శలపైనా అభిజిత్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో మేం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. పలుమార్లు, పలు చోట్ల పరిశీలనలు నిర్వహించిన తర్వాతే నిర్ధారణకొస్తామని అభిజిత్ తెలిపారు. అనుభవ పరిశోధనా పద్ధతి ఇలాగే ఉంటుందని అభిజిత్ స్పష్టం చేశారు. అనుభవవాద తాత్వికుడు డేవిడ్హ్యూమ్ చెప్పిన మాటల్ని అభిజిత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గడిచిన ప్రతిరోజూ సూర్యుడు ఉదయించాడు. అలాగని ఈరోజు కూడా ఉదయిస్తాడని చెప్పలేం అంటూ అభిజిత్ చమత్కరించారు. విమర్శల పట్ల తాను ఆందోళన చెందనని ఆయన స్పష్టం చేశారు. అనుభవ జ్ఞానం పట్ల లోతైన అవగాహన ఉండాలి. అందుకు తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అభిజిత్ తెలిపారు. మనం వీధిలోకి ఎందుకు వెళ్తాం. వీధి అంతా సముద్రంగా మారిందని అనుకోగలమా..? అలా జరుగుతుందనేందుకు మనకు రుజువులు దొరకవు అంటూ తాను ఎంచుకున్న పద్ధతిపై అభిజిత్ వివరణ ఇచ్చారు.