Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెదురు ముదురు ఘటనలు మినహా హర్యానాలోనూ ప్రశాంతం
- మహారాష్ట్రలో మొరాయించిన ఈవీఎంలు.. ఓ అభ్యర్థిపై కాల్పులు..
- రెండు లోక్సభ, 51 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు
- పాల్ఘర్లో ఎన్నికలు బహిష్కరించిన పది గ్రామాలు
- హర్యానాలో 63 శాతం.. మహారాష్ట్రలో 56 శాతం పోలింగ్
ముంబయి : మహారాష్ట్ర, హర్యానాలోని అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు లోక్సభ, 51 అసెంబ్లీ స్థానాలకూ సోమవారం జరిగిన ఉప ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. పూర్తి స్థాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాలలో పోలింగ్ మందకోడిగానే సాగింది. ఇరు రాష్ట్రాల్లోనూ సాయంత్రం 4 గంటల తర్వాతే ఓటింగ్ శాతం పెరగడం గమనార్హం. ఎలక్షన్ కమిషన్ (ఈసీ) విడుదల చేసిన లెక్కల ప్రకారం.. మహారాష్ట్రలో 56.65 శాతం, హర్యానాలో 63.55 శాతం పోలింగ్ నమోదైంది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్ (11), కేరళ (5), అసోం (4), బీహార్ (5), గుజరాత్ (6), హిమాచల్ప్రదేశ్ (2), పంజాబ్ (4), సిక్కీం (2), తమిళనాడు (2)లతో పాటు మధ్యప్రదేశ్, మేఘాలయ, తెలంగాణ, పుదుచ్చేరి, అరుణాచల్ప్రదేశ్, ఒడిషాలలోని ఒక్కోస్థానానికీ.. బీహార్లోని సమస్థిపూర్, మహారాష్ట్రలోని సతర పార్లమెంటు నియోజకవర్గాలకూ పోలింగ్ ముగిసింది. ఈనెల 24న ఫలితాలు వెలువడనున్నాయి.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఓటింగ్ 56 శాతానికే (సతర-60.25 శాతం) పరిమితమైంది. బీడ్, జల్నాలలోని పలు గ్రామాల్లో శివసేన, ఎన్సీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జౌరంగాబాద్లో ఎఐఎంఐఎం, ఎన్సీపీ.. విరార్లో శివసేన, బహుజన్ వికాస్ అగాధీ (బీవీఏ) కార్యకర్తలు గొడవపడ్డారు. వెస్ట్ ముంబయిలోని కళ్యాణ్తో పాటు రాష్ట్రంలోని దాదాపు 180 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
హర్యానాలో...
90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో.. పలు చోట్ల అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. నూహా, ఖైతాల్ పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. బర్వాలా నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు చాలాసేపు లైన్లో నిల్చున్నారు.
తగ్గిన ఓటింగ్ శాతం
గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ శాతం తగ్గింది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరగిన ఎన్నికల్లో 63.08 శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 56.65 శాతం నమోదైంది. అలాగే హర్యానాలో 76.54 శాతం నమోదవ్వగా.. ప్రస్తుతం 63.55 శాతానికి తగ్గింది. ఇక దేశ ఆర్థిక రాజధానిలో ఓటు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ముంబయిలో ఓటింగ్ 45 శాతానికి మించలేదు. ఇక దేశరాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గురుగ్రాంలో గత ఎన్నికల్లో 64.11 శాతం కాగా, ప్రస్తుతం 52.33 శాతం నమోదైంది. ప్రజలందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలనీ, ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొనాలని ప్రధాని మోడీ ట్వీట్ చేసినా ఓటింగ్ శాతం అంతంతమాత్రంగానే నమోదుకావడం గమనార్హం.
కేరళలో : ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు గానూ.. కేరళలోని కాసర్గఢ్ (66.23శాతం), ఎర్నాకుళం (53.55 శాతం), అలప్పుజ (75.76 శాతం), పతనంతిట్ట (66.37 శాతం), తిరువనంతపురం (60.81 శాతం)లోనూ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఓటేసిన ప్రముఖులు
ఇరు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పలువురు రాజకీయ, సినీ క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్లతో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ 'ఖాన్'ల త్రయం అమీర్, షారుఖ్, సల్మాన్, బచ్చన్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మిలింద్ దేవొరా, సంజరు నిరుపమ్లు ఓటు వేశారు. హర్యానాలో సీఎం ఖట్టర్, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, క్రీడాకారులు బబితా ఫోగట్, యోగేశ్వర్లూ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీలోని రాంపూర్లో బీజేపీ ఎంపీ జయప్రద ఓటు వేశారు.
అవీ ఇవీ...
- మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని మోర్సీ నుంచి పోటీకి దిగిన స్వాభిమాన్ పక్ష నాయకుడు దేవేంద్ర భుయర్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
- హర్యానాలోని అసంద్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే భక్షిక్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈవీఎంలో ఏ మీట నొక్కినా పువ్వు (బీజేపీ) గుర్తుకే పడుతుందనీ, ఈ మేరకు వాటిలో ఓ పరికరాన్ని అమర్చామని ఆయన మాట్లాడిన మాటలు వైరలయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'బీజేపీ నుంచి అత్యంత నిజాయితీపరుడు' అని పేర్కొన్నారు. భక్షిక్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- పాల్ఘర్ జిల్లాలోని పది గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. చించోటి, వద్వాన్, వరోల్ గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అరేబియా సముద్ర తీరానికి ఆనుకుని వద్వాన్ గ్రామంలో పోర్టు నిర్మించాలని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వీరు పోలింగ్ను బహిష్కరించారు. తమ నిరసన తెలపడానికే ఓటు వేయడం లేదని ప్రజలు తెలిపారు.
- ముంబయిలోని మురికివాడ ధారావిలో షాహునగర్లో కురిసిన వర్షానికి పోలింగ్ కేంద్రమంతా బురదమయమ వడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.
- మనోహర్లాల్ ఖట్టర్ సైకిల్పై వచ్చి ఓటేయగా.. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా తన కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్ మీద వచ్చి ఓటేశారు.
- పూణెలోని శివాజీనగర్ పోలింగ్బూత్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవ్వత్తుల వెలుతురులోనే ఓటింగ్ నిర్వహించారు.