Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలం గాణ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యల సాధనకి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడు తున్న సమ్మెకి ఆయన సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం చెప్పినా సర్కా రు వినకుండా సర్కారు మొండిగా వ్యవహరిం చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కార్మిక పోరాటాలను ఈ విధంగా అణచివేసేందుకు ప్రయత్నించడం ఉద్యమ పార్టీగా చెప్పుకొనే టీఆర్ఎస్ సర్కారుకు సరికాదని అన్నారు. మంగళవారం ఢిల్లీ రవిశంకర్ శుక్లా మార్గ్లోని తన నివాసంలో ఏచూరి మీడియాతో మాట్లాడారు. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ సమస్యాత్మక వైఖరి కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన వాపోయారు. ప్రభుత్వం కార్మికులపై కత్తికట్టడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని నిలదీశారు. కార్మికుల సమ్మెపైన ఇంత క్రూరంగా వ్యవహరించకూడదని చెప్పారు. వాళ్ళని పిలిచి చర్చలు జరపాలని సూచించారు. ఒక వేళ వాళ్ళ డిమాండ్లపై ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే... కార్మిక సంఘాలను చర్చలకి పిలిచి వాస్తవాలపై మంతనాలు జరపాలన్నారు. ఇటువంటి కీలక సమయాల్లోనే సానుకూలంగా వ్యవహరించడం ప్రజా ప్రభుత్వం కనీస బాధ్యత అని గుర్తు చేశారు.
అంతేకానీ, 48 వేల మంది కార్మికులను ఒకే సారి తొలగిస్తున్నట్టు సీఎం ప్రకటించడం అనుచితమని ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలను పిలిచి ఆర్టీసీ కార్మికులకి న్యాయం చేయాలని సూచించారు. లేనిపక్షంలో పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉందన్నారు.