Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు ఇచ్చిన సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు
- ఫలించిన 'టీటఫ్' పోరాటం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీటఫ్) పోరాటం ఫలించింది. విద్యుత్సంస్థల్లో పనిచేస్తున్న ఆర్జిజన్ కార్మికులకు వేతనాలు సవరించి, పే స్కేల్స్్్ ఫిక్స్ చేస్తూ టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వేతనాలకు 25శాతం అదనంగా ఫిట్మెంట్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆర్టిజన్ కార్మికులకు 'ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్' వర్తిస్తాయని, కార్మికశాఖ ఇకపై అదే విధంగా గుర్తించాలని తెలిపారు. డీఏ, హెచ్ఆర్ఏ, సీపీఏ, మెడికల్ అలవెన్స్, కార్పొరేట్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్లన్నీ వర్తిస్తాయని వివరించారు. ఇటీవల విద్యుత్శాఖలోని 21 కార్మికసంఘాలతో కూడిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీటఫ్) సమ్మెలోకి వెళ్తామని యాజమాన్యాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపచేయాలని కూడా డిమాండ్ చేశారు. వివిధ రూపాల్లో అందోళనల అనంతరం యాజమాన్యంతో పలుదఫాలుగా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. కార్మికుల డిమాండ్లను ఆమోదిస్తూ మంగళవారం సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటన చేశారు. ఆ మేరకు సవరించిన పేస్కేల్స్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి సవరించిన వేతనాలు ఇస్తున్నట్టు చెప్పారు. సవరించిన వేతనాల ప్రకారం...ఆర్టిజన్ గ్రేడ్-1 కార్మికులకు మొత్తం వేతనం రూ.29,743, గ్రేడ్-2 కార్మికులకు రూ.25,042, గ్రేడ్-3 కార్మికులకు రూ.21,719, గ్రేడ్-4 కార్మికులకు రూ.19,548 గా నిర్ణయించారు.