Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆరవసారి భారీ వరదలు
- శ్రీశైలం ప్రాజెక్టులో పెరుగుతున్న ఇన్ఫ్లో
- నిండు కుండల్లా ప్రాజెక్టులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో బేసిన్లోని ప్రాజెక్టులకు భారీగా ప్రవాహాలు నమోదవుతునన్నాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆరవ సారి వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. గత మూడు నెలలుగా వచ్చిన వరదలతో 600 టీఎంసీల నీరు సముద్రం పాలైందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కర్నాటక పరిధిలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా తుంగభద్రకు కూడా భారీ వరద రావటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 3,36,315 క్యూసెక్కుల వరద రాగా రెండు వైపులా విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి సాగర్కు 71,377 క్యూసెక్కులు విడుదల చేశారు. నాగార్జునసాగర్లో కూడా ఇన్ప్లో పెరుగుతున్నది. మంగళవారం ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 71.377 క్యూసెక్కులు కాగా ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరటంతో వచ్చిన నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. సాగర్లో నీటి మట్టం బుధవారం నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,54,910 క్యూసెక్కులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కుడి కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటకు నీరందిస్తున్నారు. యాసంగి పంటకు కూడా పూర్తి స్థాయిలో నీరివ్వటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎస్సారెస్పీలో కొనసాగుతున్న వరద...
మూడేండ్ల తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టులో మంగళవారం ఇన్ఫ్లో 45,000 క్యూసెక్కులు కాగా ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్ధ్యానికి చేరుకోవటంతో ఇదే మొత్తంలో నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ మొదటి దశ కింద 9 లక్షల ఎకరాలు, రెండవదశ కింద 7 లక్షల ఎకరాలు ఉండగా ఖరీఫ్లో నీరు విడుదల చేయలేదు. యాసంగి పంటకు నీరిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ రెండవ దశకు ఇస్తారో లేదో ఇప్పటికీ స్పష్టత రాలేదు. మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ మిడ్మానేర్కు నీరు పంపింగ్ చేయటం లేదు. 25.27 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన మిడ్మానేర్లో కేవలం 2.85 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత సీజన్లో కూడా ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం కనిపించటం లేదు.
ప్రధాన రిజర్వాయర్లలో మంగళవారం పరిస్థితి
రిజర్వాయర్ నీటి నిల్వ ప్రస్తుత నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో
సామర్ధ్యం (టీఎంసీల్లో) నీటి నిల్వ (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో) (క్యూసెక్కుల్లో)
ఆల్మట్టి 129.72 125.83 1,85,000 2,50,000
నారాయణపూర్ 37.64 33.08 2,30,000 2,57,844
జూరాల 9.66 9.62 2,30,000 2,54,910
శ్రీశైలం 215.81 210.03 3,36,315 82,369
తుంగభద్ర 100.86 100.39 1,48,100 1,55,503
నాగార్జునసాగర్ 312.05 311.75 71,377 71,377
పులిచింతల 45.77 44.18 40,267 44,548
గోదావరి బేసిన్
ఎస్సారెస్పీ 90.31 90.31 45,500 45,500
మిడ్మానేర్ 25.27 2.85 1,798 72
లోయర్ మానేర్ 24.07 18.63 4,774 4,774
ఎల్లంపల్లి 20.18 19.76 79,428 82,050